జగన్ పార్టీలోకి ఇంద్రకరణ్ రెడ్డి జంప్?
తెలంగాణ అంశం తేల్చకపోవడంపై కాంగ్రెసు పార్టీ నాయకుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటోంది. మరోవైపు, అదే అంశం వైయస్ జగన్ పార్టీ విస్తరణకు బ్రేకులు కూడా వేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణపై వైయస్ జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో తెలంగాణ నాయకులు ఆ పార్టీలోకి వెళ్లడానికి జంకుతున్నట్లు చెబుతున్నారు.
మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి వంటి నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కొత్తగా ఆ పార్టీలోకి మాత్రం తెలంగాణ నుంచి ఎవరూ వెళ్లడం లేదు. తెలంగాణ అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్ తన పార్టీని తెలంగాణలో విస్తరించడం కష్టమేనని భావిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన జగన్ను తెలంగాణ ప్రజలు అంతగా ఆదరించబోరని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొండా సురేఖ, కెకె మహేందర్ రెడ్డి, గట్టు రామచందర్ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి నాయకులు క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు. కానీ తెలంగాణ అంశం నానుతుండడంతో వారు ముందుకు సాగలేకపోతున్నారని చెబుతున్నారు. ఏమైనా, ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే, ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే ఆలోచనలోనే ఉన్నట్లు చెబుతున్నారు.