జూనియర్ ఎన్టీఆర్ ఒంటరి పొలిటికల్ ప్లాన్?

రాజకీయంగా తాను ఏం చేయాలనే విషయంపై ఆయన స్కెచ్ వేసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన వర్గానికి చెందిన నాయకులను ప్రస్తుతానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపుతున్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండి, తమ తమ స్థానాలను, పలుకుబడిని వారు నిలుపుకుంటూ రావాలనేది ఆయన ఉద్దేశమట. తెలుగుదేశం పార్టీలో ఉంటే, తగిన ప్రాధాన్యం లభించడం లేదని, దానివల్ల తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టే సరికి తన వర్గమంతా తెలుగుదేశం పార్టీలో నిర్వీర్యం అవుతుందని, అప్పుడు తాను ఏది చేయదలుచుకున్నా కష్టమేనని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల ప్రజల్లో బలంగా నాటుకుపోవడానికి వీలుంటుందని ఆయన అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికల లోగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ప్రాబల్యాన్ని కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో దెబ్బ తీయడం అవసరం కాబట్టి వైయస్ జగన్ దాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. 2014లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తే తర్వాతి పరిణామాలను కొలిక్కి తెచ్చుకోవచ్చునని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి అనివార్యమైన స్థితిలో దూరం కావాల్సి వస్తే, తానొక్కడై రాజకీయాల్లో తన సత్తా చాటాలనేది జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ అని చెబుతున్నారు. అయితే, ఇదంతా 2014 ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే తన ప్లాన్ దెబ్బ తింటుందని కూడా జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలకు సంబంధించి పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అది ఏ మేరకు ఫలితం ఇస్తుందనేది ఇప్పుడేమీ చెప్పలేం.












Click it and Unblock the Notifications