ఎంపిల డుమ్మా: పశ్చాత్తాపంతోనే బాబు సరి?
పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తుండడంతో ఆ ముగ్గురు ఎంపిలే కాకుండా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. దాంతో వారి నుంచి హుటాహుటిన వివరణ కోరారు. వారంతా వివరణ ఇచ్చారు. సుజనా చౌదరి అయితే, ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను రాసి చంద్రబాబు చేతిలో పెట్టారు. పరిస్థితి తీవ్రత అక్కడి దాకా దారి తీసింది. నిజానికి, గైర్హాజరీపై ఆ ముగ్గురు ఎంపిల కన్నా చంద్రబాబు నాయుడే ఎక్కువగా చిక్కుల్లో పడ్డారు.
దేవుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు చంద్రబాబు ఆదేశాలు లేకుండా వారు రాజ్యసభకు డుమ్మా కొట్టే అవకాశం లేదని వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కాస్తా ముందుకు వెళ్లి, చంద్రబాబుకు అత్మలాంటి సుజనా చౌదరి వెనక నుంచి కాంగ్రెసుకు అనుకూలంగా కథను నడిపించారని ఆరోపిస్తున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిన అగత్యంలో చంద్రబాబు పడ్డారు.
అయితే, పరిస్థితి చల్లబడే దాకా, ఆగి పశ్చాత్తాపం ప్రకటించారంటూ ఆ ముగ్గురుని చంద్రబాబు వలిదేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వారు పశ్చాత్తాం వ్యక్తం చేశారని, తప్పు చేసినట్లు తేలితే శిక్ష వేస్తానని చంద్రబాబు అంటున్నారు. ఆయన మాటలను బట్టి, వారిపై చర్యలు ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. ఏమైనా, ఇది చంద్రబాబు ఇటీవలి కాలంలో ఎక్కువ ఇబ్బంది పెట్టిన సంఘటన.