ఎదురు తిరిగిన 'అధినాయకుడు': బాబు ఢీలా!?

అధినాయకుడు చిత్రంలో ఓటర్లను ప్రభావితం చేయవచ్చునని భావించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆ చిత్రం ఉప ఎన్నికలు అయిపోయాక విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే అందులో అభ్యంతరకరమైనవేమీ లేవని కొట్టిపారేస్తూ ఎన్నికల సంఘం అధినాయకుడు విడుదలకు అడ్డు చెప్పలేదు. దీంతో ఆ సినిమా జూన్ 1వ తేదిన ఉప ఎన్నికలకు ముందు విడుదలయింది.
అయితే ఈ చిత్రం బాలయ్య చెప్పినట్లుగా టిడిపి తరఫున ప్రచారం కోసం కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా ప్రజల్లోకి వెళ్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందు ట్రయలర్స్లో బాలకృష్ణ డైలాగ్ ఒకటి ప్రజల్లో బాగా నానింది. 'ఇప్పటికిప్పుడు విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా చెప్పించమంటావా' అనే డైలాగ్ ఉంది.
సినిమా విడుదలకు ముందు ఈ డైలాగ్.. వైయస్ జగన్ ఆవిష్కరిస్తున్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చుననే అభిప్రాయాలు వెలువడ్డాయి. సినిమా విడుదల తర్వాత తెలిసిందేమంటే విలన్ పెడతానన్న విగ్రహం ప్రజల కోసం పాటుపడిన వ్యక్తిది కావడం గమనార్హం. సినిమా విడుదలకు ముందు జగన్ను టార్గెట్గా చేసుకొనే ఆ డైలాగ్ ఉందని అందరూ భావించడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రచారానికి దోహదపడిందని అంటున్నారు.
సినిమా విడుదల తర్వాత కూడా ఓ మంచి వ్యక్తికి విగ్రహం పెడతామని ముందుకు వచ్చినట్లుగా ఉంది. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను జగన్ ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఈ డైలాగ్ ఎదురు తిరిగిందని అంటున్నారు. అంతేకాకుండా ట్రయలర్స్ చూసిన వారు సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని భావించారు. కానీ పాక్షిక రాజకీయ నేపథ్యం మాత్రమే కనిపించింది.
సినిమా ఘన విజయం సాధించక పోవడానికి కారణం.. అందరూ ఊహించుకున్న దానికి భిన్నంగా ఉండటమే కారణంటున్నారు. టిడిపి తరఫున ప్రచారం కోసం తన చిత్రం వెళుతుందని, టిడిపికి మంచి ఫలితాలు తీసుకు వస్తుందని బాలయ్య ఆశించినప్పటికీ ఉప ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మాత్రం ఢీలా పడిపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications