జెసిపై గురి పెట్టిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
రాయల తెలంగాణ అని కానీ, సీమాంధ్ర అని కానీ అంటే ఊరుకునేది లేదని, సొంత ఎజెండాతో వ్యాపార లబ్ధి కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకోవటం దారుణమని ఆయన అనడం వెనక లగడపాటిని, జెసిని దృష్టిలో పెట్టుకున్నారనే మాట వినిపిస్తోంది. ప్రజల మనోభావాలను గుర్తించకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారిపై కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు
అదే సమయంలో కొత్త వాదనను ముందుకు తెచ్చారు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే రీతిలో ఆయన మాటలు ఉన్నట్లుగా భావన కలిగేలా ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తాము ఎవరితోనే కలసి ఉండాల్సిన అవసరం లేదని, పూర్వపు రాయలసీమ, బళ్ళారి, రాయచూరు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
బళ్లారిలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఆయన అనుచరుడు శ్రీరాములు కొత్త పార్టీ కూడా పెట్టారు. ఈ పార్టీకి పునాది బళ్లారిలోనే ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డికి, వైయస్ జగన్కు మధ్య గల అనుబంధం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి కొత్త వాదన వల్ల కర్ణాటక రాజకీయాల్లోనూ ముసలం పుట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.