చంద్రబాబుకు సురవరం షాక్, కెసిఆర్కూ...
బర్దన్ నుంచి పార్టీ పగ్లాలను తీసుకున్న సురవరం సుధాకర్ రెడ్డి పార్టీని సొంత కాళ్ల మీద నిలబెట్టే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిపిఐ అనుకూల వైఖరి తీసుకుంది. అయితే, తెలంగాణ జెఎసితో కలిసి పనిచేయడానికి కూడా తాము సిద్ధంగా లేమని సురవరం సుధాకర్ రెడ్డి ప్రకటించారు. అది ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మింగుడు పడని విషయమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయబద్దమైందని సుధాకర్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు చెందిన సుధాకర్ రెడ్డి భవిష్యత్తులో తెలంగాణ ఎజెండాపై పార్టీని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా చేయవచ్చునని భావిస్తున్నారు.
వచ్చే ఉప ఎన్నికల్లో పరకాల నుంచి సిపిఐ పోటీ చేయాలని భావిస్తోంది. గత ఉప ఎన్నికల్లో సిపిఐ తెరాసకు మద్దతిచ్చింది. ఏ పార్టీతోనూ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి సిపిఐ సిద్ధంగా లేకపోవడమే కాకుండా తనకు బలం ఉన్న చోట్ల పోటీ చేస్తూ క్యాడర్ను నిలబెట్టుకోవడమే కాకుండా పెంచుకునే ప్రయత్నాలు సాగించాలని అనుకుంటున్నట్లు సుధాకర్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది. సిపిఎం పట్ల కూడా దాదాపుగా సిపిఐ అదే వైఖరి తీసుకుంటోంది.
వామపక్షాల ఐక్యత పేరుతో సిపిఎం వెనక నడవడానికి కూడా సిపిఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. సిపిఎం రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం చాలా కాలంగా సిపిఐలో ఉంది. దానికి గండి కొడుతూ అంశాలవారీగా మాత్రమే సిపిఎం కలిసి పనిచేస్తామని అంటున్నారు. ఎన్నికల్లో మాత్రం స్వతంత్రంగానే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వామపక్షాల మధ్య పరస్పర పోటీ తప్పు కాదని సురవరం సుధాకర్ రెడ్డి చెప్పిన మాటల్లోని ఆంతర్యం అదేనని భావిస్తున్నారు. ఏమైనా, సిపిఐ స్వతంత్ర నిర్ణయాల రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.