లోకసభకు.. టిలో బాబు, సీమాంధ్రలో బాలకృష్ణ?
చంద్రబాబు ఇప్పటిదాకా లోక్సభకు ప్రాతినిధ్యం వహించలేదు. ఆరుసార్లుగా అసెంబ్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా కుప్పం నుంచే పోటీకి సన్నాహాలు చేసుకొంటున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలుఆగి, లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే బాబు ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని మల్కాజిగిరి లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఆయన పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
మల్కాజిగిరి నియోజకవర్గం టిడిపికి బలమైన స్థానంగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందూపురం స్థానం టిడిపి చేతిలో ఉంది. 2014 ఎన్నికలలో బిజెపి, తెలుగుదేశంలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే గెలుపు ఖాయమని బిజెపి, టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.
అదే జరిగితే చంద్రబాబు ఎంపీగా వెళ్లి కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని, ఆ హోదాలో రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఆయన పార్టీ ఇమేజ్ పెంచి, వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేస్తారని అంటున్నారు. కేవలం లోక్సభ ఎన్నికలు జరిగితే సినీ హీరో బాలకృష్ణ కూడా సీమాంధ్రలో ఒకచోట నుండి లోక్సభకు పోటీ చేసే అవకాశముందంటున్నారు. మరోవైపు లోక్సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ కూడా ఒంగోలు పార్లమెంటు సీటుపై దృష్టి సారించారని అంటున్నారు.