విభజన: హైదరాబాద్పైనే కన్నేసిన చిరంజీవి
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్ మీదనే కన్నేసినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో సమన్యాయం కావాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతుంటే, ఆ సమన్యాయానికి చిరంజీవి కొత్త అర్థం చెబుతున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సమన్యాయం జరుగుతుందని చిరంజీవి అంటున్నారు.
శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన ఆ సమన్యాయానికి అర్థం చెప్పారు. రాష్ట్ర విభజనకు ఆయన పూర్తిగా అంగీకరించినట్లు కనిపిస్తున్నారు. చిరంజీవి ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకుంటారనే విమర్శలు ఈ నేపథ్యంలో పెరిగాయి. తాను ప్రజారాజ్యం పార్టీని పెట్టిన కొత్తలో సామాజిక తెలంగాణ కావాలంటూ అడిగారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. సమైక్య నినాదంతో ఆయన సీమాంధ్రలో పర్యటించారు. కరుడు గట్టిన సమైక్యవాదినని ఆయన అనిపించుకున్నారు.
కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే, సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడిన తర్వాత కాస్తా మౌనంగా ఉన్నారు. కానీ ఆందోళనలు పెరగడంతో గొంతు విప్పడం ప్రారంభించారు. ఇప్పుడు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని అడుగుతున్నారు. ఏమైనా, చిరంజీవికే ఇది చెల్లుబాటు అవుతుందని గిట్టనివారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications