డిఎంకె వెనక్కి: మాట్లాడబోనన్న ఖుష్పూ
ఖుష్పూ దాడిని కిరాతకంగా డిఎంకె అభివర్ణించింది. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. డిఎంకె భవిష్యత్తు నేతను కరుణానిధి ఒక్కరు ఎన్నుకుంటేనో, నిర్ణయిస్తేనో కుదరదని, పార్టీలో ఏ చిన్న పదవైనా సంస్థాగత ఎన్నికలు అనివార్యమని, గెలుపొందిన వారే పదవుల్ని పొందుతారని, డిఎంకె అధ్యక్షుడి ఎన్నిక కూడా అలాగే ఉంటుందని, దాన్ని పార్టీ జనరల్ కౌన్సిల్ ఖరారు చేయాల్సి ఉంటుందని ఖుష్బూ అన్నారు. ఈ వ్యాఖ్యలే స్టాలిన్ వర్గానికి ఆగ్రహాన్ని తెప్పించాయి.
తాను కోలుకుంటున్నానని ఖుష్పూ చెప్పింది. ఈ మేరకు ఆమె అభిమానులను ఉద్దేశిస్తూ ట్విట్టర్ రాశారు. దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు దాని గురించి తాను మాట్లాడదలుచుకోలేదని ఆమె అన్నారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
డిఎంకెలో సోదరులు స్టాలిన్, అళగిరి మధ్య చోటు చేసుకున్న వారసత్వ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. డిఎంకె అధినేత, తండ్రి కరుణానిధి స్టాలిన్కు అనుకూలంగా మాట్లాడడంతో వివాదం ముదిరింది. ఈ వివాదం నేపథ్యంలోనే ఖుష్పూ చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ వర్గీయులు మండిపడ్డారు.