వైయస్ తర్వాతే..: సిఎం వాదనపై సోనియా ఆసక్తి

తన తండ్రి మూలంగా చిత్తూరు జిల్లాతో రాజకీయ సంబంధాలు ఉన్నప్పటికీ, తాను తెలంగాణ వాడినని, అక్కడే పుట్టి, పెరిగానని చెప్పారట. అక్కడి ప్రజల మనోభావాలు తెలుసునని, రాజకీయ నేతల గురించి కూడా తెలుసునని చెప్పారట. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరుల ముందు తన ప్రజెంటేషన్ను కిరణ్ ఈ మాటలతోనే ప్రారంభించారట. దీంతో అక్కడున్న అగ్రనేతలు ఆసక్తిగా విన్నారట.
"తెలంగాణ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి! కానీ... ఇచ్చిన తర్వాత తలెత్తే పరిణామాలను తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి'' అని కిరణ్ కోరారట. సమైక్య వాదాన్ని బలంగా వినిపించారట. నీటిపారుదల, విద్యుత్, శాంతి భద్రతలు, ఆదాయ వనరులు, నిధుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బలాబలాల గురించి బలమైన వాదన వినిపించారట.
2009లో కెసిఆర్ ఎందుకు నిరాహార దీక్ష చేశారు? హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన 14ఎఫ్ నిబంధన తొలగించాలనే డిమాండ్తో ఆయన నిరశన దీక్షకు దిగారని కానీ, ఢిల్లీలో భయపడిపోయి ఏకంగా తెలంగాణ ఇస్తామంటూ ప్రకటించారని, తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ బలోపేతం చేయగలిగింది అందువల్లే నని చెప్పారట. 2004తో పోల్చితే 2009లో కెసిఆర్ బలం తగ్గడం నిజమని చెప్పారట.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తలెత్తిన పరిస్థితులవల్లే ఈ పరిణామాలన్నీ జరిగాయని, లేదంటే తెరాస ఉనికే ప్రశ్నార్థకంగా మారేదని, ఇప్పుడు కూడా కేవలం నాలుగు జిల్లాల్లోనే ఆ పార్టీ ఉనికి బలంగా ఉందని చెప్పారట. నదీ పరివాహక ప్రాంతాలు, తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టులు, వాటికి అవసరమయ్యే విద్యుత్తు, నీటి సమస్యలు, సంఘర్షణలు తలెత్తే అవకాశాలు, కృష్ణా డెల్టాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మొదలైన అనేక విషయాల గురించి ఆయన గణాంకాలు, మ్యాప్లతో వివరించారట. కిరణ్ ప్రజెంటేషన్ను అందరూ ఆసక్తిగా విన్నారట.












Click it and Unblock the Notifications