మోడీ ఎఫెక్ట్: బాబు దీక్షకు లెఫ్ట్ నేతలు దూరం
న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను వామపక్షాల నాయకులు కూడా గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎల్లవేళలా మిత్రులుగా కొనసాగుతూ వస్తున్న వామపక్షాల నేతలు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబును వివిధ పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు.
చంద్రబాబు దీక్షకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిచినా వారు రాలేదని తెలుస్తోంది. సిపిఎం నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరిలను, సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, ఎబి బర్దన్, ఎ రాజాలను తెలుగుదేశం పార్టీ నాయకులు సంప్రదించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు పట్ల అంత కటువుగా వామపక్షాల నేతలు ఉండడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే కారణమని అంటున్నారు. నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడంతో చంద్రబాబుకు పూర్తిగా దూరం జరగాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మోడీతో వేదికను పంచుకోవడంపై వామపక్షాల నేతలు తెలుగుదేశం పార్టీల నాయకులు నిలదీసినట్లు తెలుస్తోంది.
మోడీతో వేదికను పంచుకోవడానికి అంత ప్రాధాన్యం లేదని చెప్పినా వామపక్షాల నేతలు వినిపించుకోలేదని అంటున్నారు. గతంలో ఓసారి బిజెపితో అవగాహనకు వచ్చినప్పటికీ చంద్రబాబుతో వామపక్షాలు దోస్తీని కొనసాగించాయి. కానీ, ఇక ముందు అటువంటి ఆటలు సాగవని వారు చెప్పదలుచుకున్నారని అంటున్నారు.