చిరంజీవి, పురంధేశ్వరి... రిజైన్: 'రాజీ' డ్రామానా?
తెలంగాణపై కేబినెట్ ఆమోదం నేపథ్యంలో పలువురు సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మంత్రులు రాజీనామా చేశారని వారి కార్యాలయాలు చెబుతుండగా, మరికొందరు తాము ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలు పంపించామని చెబుతున్నారు. అయితే ఆ రాజీనామాలు అన్నీ ఉత్తివేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా తమకు అందలేదని పిఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్స్ ద్వారా అందిన రాజీనామాలు చెల్లవని చెబుతున్నారు. పలువురు నేతలు తాము ఫ్యాక్స్ ద్వారా పంపించామని చెబుతున్నారు. కానీ అవి చెల్లుబాటు కావని పిఎంవో వర్గాలు చెబుతున్నాయి.
కేబినెట్ నోట్ ఆమోదం పొందగానే కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పల్లం రాజులు రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. శుక్రవారం దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణిలు రాజీనామా చేసినట్లు చెప్పారు. తాము ఫ్యాక్స్ ద్వారా వాటిని పంపించామన్నారు.
ప్రధానిని స్వయంగా కలిసి ఇస్తేనే రాజీనామాలు చెల్లుబాటు అవుతాయని తెలిసి అలా పంపించడమేమిటని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎ రాజా ప్రధానిని స్వయంగా కలిసి రాజీనామా ఇచ్చాకనే ఆమోదం పొందింది. ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మీడియాలో ప్రచారం కోసమే రాజీనామాలు చేశామంటూ లీకులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని సమైక్యవాదులు ఆరోపిస్తున్నారు.