చిక్కుల్లో.: కెసిఆర్ కోసమా? కెవిపి వ్యూహమా?
కాంగ్రెసులో తెరాస విలీనానికి కెసిఆర్ తనకు సిఎం పదవి సహా పలు డిమాండ్లు పెట్టారనే వార్తలు వచ్చాయి. వాటిని తెరాస కొట్టిపారేసినప్పటికీ పలువురిలో అనుమానాలు తొలగిపోలేదు. కెసిఆర్ డిమాండ్లకు అధిష్టానం నో చెప్పినందునే ఎంపీలు రాజీనామాపై బెట్టు వీడటం లేదేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజీనామాకు సై అంటున్న నేతలు మొదటి నుండి కెసిఆర్కు అనుకూలంగా ఉన్నవారే కాకుండా తెరాస వైపు జంప్ అవుతారనే వారు ఉన్నారని, అందుకే ఈ అనుమానాలు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.
కెకె తొలి నుండి కెసిఆర్కు అనుకూలమని, రాజయ్య, వివేక్లను కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారని, జగన్ పార్టీ తెలంగాణకు నో చెప్పాక కోమటిరెడ్డి తెరాసలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. వీరే రాజీనామాలపై బెట్టు వీడటం లేదంటున్నారు. రాహుల్కు సన్నిహితుడుగా ముద్రపడిన యాష్కీ మాత్రం నో చెబుతున్నారు. కెసిఆర్ కోసమే ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణ కోసం ఫ్రంట్ పెడతారా తెరాసలో చేరతారా చెప్పాలని కూడా యాష్కీ ప్రశ్నించారు. తాను మాత్రం తెరాస కోసం రాజీనామా చేయనని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ముఖ్యమో ఎన్నికలు ముఖ్యమో తేల్చుకోవాలని సూచించారు. మరోవైపు వారి వెనుక కెవిపి రామచంద్ర రావు ఉండి నడిపిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. జగన్ కోసమే కెవిపి ఇదంతా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.