తెలంగాణ: ఆ ముగ్గురితోనే ముప్పుతిప్పలు
కావూరి లాంటి వారు పార్టీ నాయకత్వాన్నే సవాల్ చేసే ధోరణిలో మాట్లాడుతుంటే ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కానీ, పార్లమెంటు సభ్యులు గానీ ఆయనను నిరోధించే ప్రయత్నాలు చేయడం లేదని, పైగా ఆయనతో కలుపుగోలుగా ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నైతిక బలాన్ని సమకూరుస్తున్నారని తెలంగాణ నాయకులు విమర్శిస్తున్నారు. దీంతో అధికార కాంగ్రెస్లోనే పూర్తిస్థాయిలో విభజన వచ్చిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణపై స్పష్టత కోసం ఈ ప్రాంత నేతలు ఢిల్లీ వెళ్ళి వచ్చిన కొద్ది రోజులకే సీమాంధ్ర నేతలు వెళ్ళి లాబీయింగ్ చేయటం, ఫలితంగా అధిష్ఠానం ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురుకావటం వంటివి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. గత నెల 28న కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ప్రకటించినప్పటినుంచీ సీమాంధ్ర నేతలు క్రియాశీలమయ్యారు. కావూరి సాంబశివరావు లాంటి వారు బాహాటంగా సమైక్యాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసే సమావేశాలకు వెళ్ళి అటు పార్టీ నాయకత్వాన్ని, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలనూ విమర్శిస్తున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు తనకు అవకాశం దక్కకపోవటం ఫలితంగా అసంతృప్తితో రగిలిపోతున్న కావూరి ఈ మధ్య కాలంలో సూటిగా తన అస్త్రాలను నాయకత్వంపైనే ఎక్కుపెట్టారు. మరోవైపు మంత్రి కాసు కృష్ణారెడ్డి తాను కూడా సమైక్య వాదినే అని, రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తాననటంతో పాటు రాజీనామా తనకు కాగితం ముక్కతో సమానమని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. మరో మంత్రి శైలజానాథ్ హడావుడిగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి షిండే తదితరులను కలసి మరోసారి సమైక్య వాదాన్ని వినిపించి వచ్చారు.
రాష్ట్రం విడిపోయే సమస్యే లేదని లగడపాటి లాంటి వారు అవకాశం చిక్కినప్పుడల్లా ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటినీ చూసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీంతో రాష్ట్ర విభజన మాట అటుంచి, కాంగ్రెసు పార్టీలో స్పష్టమైన విభజన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.