దోస్తీ: జగన్ అసదుద్దీన్ ఆఫీసుకు వెళ్తారట
హైదరాబాద్: మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో దోస్తీని పునరుద్ధరించుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన వ్యక్తిగతంగా అసదుద్దీన్ను కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో దోస్తీకి సిద్ధపడి ఆ తర్వాత మజ్లీస్ వెనక్కి వెళ్లిపోయింది. తిరిగి ఆ దోస్తీని పునరుద్ధరించుకోవాలని జగన్ అనుకుంటున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైయస్ జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
మజ్లీస్ ఆఫీసుకు వైయస్ జగన్ స్వయంగా వెళ్లి స్నేహ హస్తం అందజేస్తారట. సిపిఎంతో సంబంధాలను పెంచుకోవడానికి ఇటీవల జగన్ తన తరఫున మైసురారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులను ఆ పార్టీ కార్యదర్శి బివి రాఘవులు దగ్దరకు పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మజ్లీస్పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

పాఠశాల రోజుల నుంచి అసదుద్దీన్కు, జగన్కు మంచి సంబంధాలున్నాయి. వారిద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. వైయస్ రాజశేఖర రెడ్డితో కూడా అసదుద్దీన్కు మంచి సంబంధాలుండేవి. కాంగ్రెసు పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత అసదుద్దీన్ జగన్కు సన్నిహితం కావడానికి ప్రయత్నించారు. కానీ, బంధాన్ని పెంచుకోవడంలో విరామం వచ్చింది.
సమైక్యాంధ్ర ఉద్యమానికి కూడా మజ్లీస్ సహకారం తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాదులో పలుకుబడి గల మజ్లీస్ పార్టీ మద్దతు సమైక్యాంధ్ర ఉద్యమానికి బలం ఇస్తుందని ఆయన అనుకుంటున్నారు. రాష్ట్ర విభజనను మజ్లీస్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications