బాబు రాజకీయం: ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఏకం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయం మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా, నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లను కూడా ఏకం చేసిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నందమూరి హరికృష్ణ కుటుంబానికి చంద్రబాబు నాయుడు స్థానం లేకుండా చేశారు.
శాసనసభ, లోకసభ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే కాదు, హరికృష్ణకు కూడా ఏ విధమైన పాత్ర లేకుండా చేసింది చంద్రబాబునాయుడేనని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సుకత ప్రదర్శించినప్పటికీ హరికృష్ణకు టికెట్ నిరాకరించారు. బాలకృష్ణను చేరదీసిన చంద్రబాబు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులను పక్కన పెట్టారు.
పైగా, చంద్రబాబు నాయుడు మెగా హీరో పవన్ కళ్యాణ్తో దోస్తీ కట్టారు. చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి స్నేహహస్తం చాచారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన చేత ప్రచారం చేయించుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం పూర్తిగా విస్మరించారు.
తన తండ్రి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ను విస్మరించినప్పటికీ కళ్యాణ్ రామ్ మామ చంద్రబాబు, బాబాయ్ బాలయ్య వైపు ఉండడానికి ప్రయత్నించినట్లు చెబుతారు. కానీ వారిద్దరు కళ్యాణ్ రామ్ను కూడా పట్టించుకోలేదని అంటున్నారు. ఈ స్థితిలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఏకమయ్యారని అంటున్నారు. ఇందులో భాగంగానే కళ్యాణ్ రామ్ చిత్రం పటాస్ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.