కెసిఆర్కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్?
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును బుజ్జగించే ప్రయత్నాలను కాంగ్రెసు అధిష్టానం ముమ్మరం చేసినట్లు ప్రచారం సాగుతోంది. తమ పార్టీలో తెరాసను విలీనం చేస్తే ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కాంగ్రెసు అధిష్టానం కెసిఆర్కు ఆశ చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్టానం మనోగతాన్ని సీనియర్ నాయకుడు ఒకరు తెరాస అధినేత కెసిఆర్కు తెలియజేసినట్టు ఏఐసిసి వర్గాల కథనం.
అధిష్టానం ప్రతిపాదనను కెసిఆర్ లోతుగా పరిశీలించిన అనంతరం ఢిల్లీకి వచ్చి పార్టీ అధినేత్రి సోనియాను కలుస్తారని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించి తెరాసను విలీనం చేస్తే, అనంతరం కెసిఆర్ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కొత్త రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి దించుతారనే మాట వినిపిస్తోంది. విలీనం అంశంపై రెండు పార్టీల సీనియర్ల మధ్య తెరవెనుక చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా అసెంబ్లీ నుంచి రాగానే పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం పొందేందుకు తాము చేస్తున్న ఏర్పాట్లను కెసిఆర్కు కాంగ్రెస్ హైకమాండ్ వివరించినట్టు సమాచారం.

తెలంగాణ బిల్లును ఫిబ్రవరి మొదటి పక్షంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే లోక్సభలో ప్రతిపాదిస్తారు. ఫిబ్రవరి నెలాఖరుకు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి గతంలో ప్రకటించిన విధంగా విలీనానికి సిద్ధపడాలని పార్టీ అధిష్టానం పెద్దలు తెరాస అధినేత కెసిఆర్కు మధ్యవర్తుల ద్వారా సూచించినట్టు సమాచారం.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస ఒకటిగా పోటీ చేస్తే మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు వీలుంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయాలని కెసిఆర్పై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. తనకు వచ్చిన ఆఫర్పై కెసిఆర్ తన సన్నిహితులతో, పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications