స్మృతి ఇరానీకి యేల్ డిగ్రీ ఉన్నట్లా, లేనట్లా?
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్ఙత మరోసారి వివాదంగా మారింది. తనకు యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని ఆదివారంనాడు చెప్పారు. ఇండియా టుడే మహిళా సమ్మేళనం 2014లో ఈ విషయం చెప్పారు. అదే సమయంలో పనితీరు ఆధారంగా తనను అంచనా వేయాలని కూడా చెప్పారు.
రెండు ప్రమాణ పత్రాల్లో విద్యార్హతలపై వేర్వేరుగా ఆమె చెప్పారు, ఈ రెండింటిలో ఏది నిజమంటే మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. తన విద్యార్హతపై న్యాయస్థానంలో పిల్ వేస్తే అన్నింటికీ అక్కడే జవాబు ఇస్తానని స్మృతి ఇరానీ చెప్పి మరింత గందరగోళంలో పడేశారు.
అదలావుంటే, ఆమె మరో ప్రకటన చేశారు. యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీపై మానవ వనరలు అభివృద్ధి మంత్రిత్వ సోమవారం స్పష్టత ఇచ్చింది. భారతదేశానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులతో పాటు ఓ ఎంపిగా స్మృతి ఇరానీ యేల్ విశ్వవిద్యాలయంలో జరిగే నాయకత్వ సదస్సుకు వెళ్తున్నట్లు తెలిపింది.
ఆమె ఆ సదస్సులో పాల్గొనడానికి ఆమె డిగ్రీ సర్టిఫికెట్ పొందే విషయానికి సంబంధం లేదని కూడా చెప్పింది. మొత్తం మీద స్మృతి ఇరానీ విద్యార్హత విషయం ఇప్పట్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు.