నాటి అటెండరే.. నేటి ముఖ్యమంత్రి(ఫొటో)
దుబ్బాక: తన చిన్నతనంలో అటెండర్గా విధులు నిర్వహించేందుకు ఇష్టపడే ఓ వ్యక్తి.. ఇప్పుడొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎవరో కాదు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయన చదువుకునే రోజుల్లో స్వపరిపాలన దినోత్సవాల్లో అటెండర్గా విధులు నిర్వహించేందుకు ఇష్టపడేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంపై అతని చిన్ననాటి మిత్రుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెబుతున్నారు.
కెసిఆర్ను కలిసేందుకు వెళ్లిన క్రమంలో తమతోపాటు ఆయన చదువుకునే రోజుల్లో అటెండర్గా స్వపరిపాలనలో పాల్గొన్న ఫొటోను చూపడంతో కెసిఆర్ చాలా సంతోషపడ్డారని ఆయన మిత్రులు చెప్పారు. అప్పుడు అటెండర్ను కావడం వల్లే తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అయ్యానంటూ పాత ఫొటోను చూస్తూ మిత్రులతో కెసిఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
1967-68లో దుబ్బాకలో 9వ తరగతి చదివిన కెసిఆర్, స్వపరిపాలన దినోత్సవాల్లో అటెండర్గా పనిచేసి గ్రూపు ఫొటోలో కింద కూర్చుండి ఉన్న ఫొటోను చూస్తూ కెసిఆర్ తన పాత జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్నారు. తనకు చదువుకునేటప్పుడు అటెండర్ అంటేనే ఇష్టం ఉండేదని చెప్పారు. అప్పుడు తనకంటే సీనియర్ అయిన దుబ్బాక మాజీ సర్పంచ్ శ్రీరాం వెంకన్న ప్రసంగం చేస్తుంటే తాను ఆయనకు సరిగా మాట్లాడటం రాదంటూ నవ్వానని, అప్పుడు తనను రూంలో వేసి కొట్టాడంటూ గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా అందరి యోగ క్షేమాలను కెసిఆర్ అడిగి తెలుసుకున్నారని మిత్రులు తెలిపారు. కెసిఆర్ తన అక్క సుమతితో కలిసి 6 నుంచి 10వ తరగతి వరకు దుబ్బాక ప్రభుత్వ హైస్కూల్లో చదివారు. చింతమడ్క నుంచి అక్కతో కలిసి కొన్ని రోజులు నడుచుకుంటూ దుబ్బాకకు వచ్చి కెసిఆర్ చదువుకున్నారన్నారు.
అనాటి గురువు చింతమడ్కకు చెందిన రఘురాంరెడ్డితో కలిసి రూంలో ఉండి చదువుకున్నారని, చిన్నతనంలో కెసిఆర్ చిలిపి చేష్టలు ఎక్కువ చేసేవాడని మిత్రులు తెలిపారు. ఏదేమైనా దుబ్బాకలో తమతో పాటు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కావడం తమకెంతో గర్వకారణమని కెసిఆర్ మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.