వైయస్ దారిలో కెసిఆర్: వైయస్ జగన్ ఫెయిల్?
హైదరాబాద్: నిప్పు లేనిదే పొగ రాదని ఓ సామెత. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై గమ్మత్తయిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీ నాయకుల నుంచి వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు, మంత్రులు ఇస్తున్న సమాధానాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విషయంలో కెసిఆర్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దారిలో నడుస్తున్నారని కాంగ్రెసు శానససభ్యులు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలను బలహీనపరచడానికి శాసనసభ్యుల వలసలను కెసిఆర్ ప్రోత్సహించడంపై కాంగ్రెసు శాసనసభ్యులు శాసనసభలో కూడా దుమారం రేపారు. వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో పది మంది ప్రతిపక్ష శాసనసభ్యులను కాంగ్రెసులో చేర్చుకుంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని టిఆర్ఎస్ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణా రావు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి కాంగ్రెసు పార్టీని గెలిపించడంలో, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడంలో రాజకీయ నీతిని ప్రయోగించారు. వ్యూహం ప్రకారం తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీల శాసనసభ్యులను, నాయకులను కాంగ్రెసు వైపు లాక్కున్నారు. ఆ రకంగా కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించడాని కన్నా ప్రత్యర్థులను బలహీనపరచడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
వైయస్ వ్యూహాన్నే కెసిఆర్ తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను బలహీనపరచడానికి ప్రయోగిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపరచడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
అయితే, ఎన్నికల్లో విజయం సాధించడానికి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యూహాన్ని అనుసరించి, పక్కాగా పథకం రచించి అమలు చేయడంలో వైయస్ జగన్ విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికలకు ముందు విపరీతంగా వలసలను ప్రోత్సహించిన జగన్ ఎన్నికల్లో పక్కా వ్యూహాన్ని రచించి అమలు చేయడంలో విఫలమయ్యారని అంటున్నారు. ఇప్పుడు నాయకులను కాపాడుకోవడమే ఆయనకు సమస్యగా మారిందని అంటున్నారు.