మెట్రో X కేసీఆర్: అసెంబ్లీ చారిత్రక కట్టడం కాదా?
హైదరాబాద్: అసెంబ్లీ భవనం చారిత్రక కట్టడాల గుర్తింపు జాబితాలో లేదట! మెట్రో రైలుతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లడానికి వీల్లేదని, అసెంబ్లీ సహా పలు ప్రాంతాల్లో కచ్చితంగా మెట్రో కారిడార్ రూటు మార్చాల్సిందేనని, భూగర్భ మార్గం లేదా మరో ఇతర మార్గం గుండా మెట్రో రైలు కారిడార్ నిర్మించి చారిత్రాత్మక కట్టడాలను రక్షించాలని తెరాస చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, జాబితాలో అసెంబ్లీ భవనం లేదట.
హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలను.. 1, 2, 2ఎ, 2బి అంటూ నాలుగు కేటగిరీలుగా గుర్తిస్తూ సర్కారు గతంలో పలు జీవోలను జారీ చేసింది. అయితే, ఇలా గుర్తించిన ఏ కేటగిరీలోనూ అసెంబ్లీ భవనం పేరు లేదట. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మెట్రో రైలు కారిడార్ అలైన్మెంట్ మార్పు గురించి ప్రకటన చేసినది మొదలు ఇప్పటి వరకూ పలు దఫాలుగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహించింది.
అసెంబ్లీ చారిత్రక భవనమని, దీన్ని పరిరక్షించుకోవాలని ఇందు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కేసీఆర్ చెప్పినట్లు హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రత్యామ్నాయ అంశాలపైనా దృష్టి సారించాయి. కానీ అసలు అసెంబ్లీ భవనం చారిత్రక కట్టడాల జాబితాలోనే లేదట. దీంతో, నిర్ఘాంతపోవడం ఎల్ అండ్ టీ ఇంజనీర్లు వంతు అయిందట. పనులు సాఫీగా జరుగుతున్నప్పుడు సర్కారు మెలిక పెట్టడంపై ఇప్పుడు ఎల్ అండ్ టీ ఇంజనీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట.
మరోవైపు, అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ ప్రాంతాల వద్ద భూగర్భ రైలు లేదా మరో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని హెచ్ఎంఆర్ ఎండీ ఓ ఛానల్తో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం. మరోవైపు మంత్రి కేటీ రామారావు కూడా అసెంబ్లీ వద్ద భూగర్భ రైలు ఉంటుందని చెప్పారు.