అప్పటి మాట నీటి మూటేనా: కెసిఆర్పై పాల్వాయి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీరును కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. విలీనం విషయంలో కెసిఆర్ మాట తప్పారని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెసు అధిష్టానానికి, కెసిఆర్కు మధ్య చర్చలు జరగడంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
కెసిఆర్ను పిలిపించండి మాట్లాడదామని అధిష్ఠానం తనకు సూచించడంతో తాను ఆయన్ను ఢిల్లీ పిలిపించినట్లు పాల్వాయి చెప్పారు. అధిష్ఠానం పెద్దలు ఎవ్వరూ అడగకముందే కెసిఆర్ స్వయంగా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని వయలార్ రవి, గులాంనబీ ఆజాద్లతో అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్తో అయితే ఈ మాటను ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు.
ఇప్పుడు కెసిఆర్ మాట మార్చటం మంచిది కాదని, ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడి ఉండాలన్నారు. సోనియా గాంధీ రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు సోమవారం విందు ఇచ్చిన సందర్భంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు.
ఈ విందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఒకరిద్దరు మినహా మిగతా కేంద్ర మంత్రులు, ఎంపీలు అంతా హాజరయ్యారు. సీమాంధ్ర నుంచి కేంద్ర మంత్రులు కావూరు సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, పళ్లం రాజు, చిరంజీవి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, పార్లమెంటు సభ్యులు సుబ్బిరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, చింతామోహన్, బొత్స ఝాన్సీ, కెవిపి రామచంద్రరావు హాజరయ్యారు.