చంద్రబాబు తిప్పలు, నీళ్లు తోడేశాక వచ్చారు
హైదరాబాద్: తాత్కాలిక కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ అతిథి గృహం తడిసి పోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం వరకు ఇంటి నుండే కార్యకలాపాలు చక్కబెట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి లేక్ వ్యూ అతిథి గృహంలోని నీళ్లను తోడేసి, మరమ్మతు చేశాక చంద్రబాబు వచ్చారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. సచివాలయంలో కార్యాలయం సిద్ధం కాక పోవడంతో, తాత్కాలిక కార్యాలయంగా లేక్ వ్యూను ఉపయోగించుకుంటున్నారు. అందులో కూడా వర్షపు నీరు రావడంతో చంద్రబాబు తన నివాసం నుండే సమీక్షలు నిర్వహించారు.
లేక్ వ్యూలో పై నుండి కిందకు నీరు వెళ్లే పైప్ లైన్ నుండి నీరు ఎగదన్ని గదుల్లోకి వచ్చింది. అర్ధరాత్రి దాటే వరకు దీనిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. బాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ గదితో పాటు ఇతర గదుల్లోకి, హాలులోకి నీళ్లు వచ్చాయి.

నాలుగు రోజుల క్రితం భవనం పై కప్పు నుండి ఒక పెద్ద పెచ్చు ఊడి పడింది. అక్కడి నుండి నీరు పడుతోంది. ఈ పరిస్థితితో మంగళవారం మధ్యాహ్నం వరకు చంద్రబాబు లేక్ వ్యూకు రాలేక పోయారు. తన నివాసంలోనే సమీక్ష చేశారు. మధ్యాహ్నం నీరు తోడేశాక లేక్ వ్యూకు వచ్చారు.
నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం లేక్వ్యూ గెస్ట్ హౌస్ మొదటి అంతస్థు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ముఖ్యమంత్రి చందర్బాబు వ్యక్తిగత సిబ్బంది పనిచేసే గది పైకప్పు కూలిపోయింది. చంద్రబాబునాయుడు అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే గదిపైకప్పు కుప్పకూలింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో లేక్వ్యూకు వెళ్లాలా వద్దా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications