పాపం: రోశయ్య ఫొటోలు చెత్తలో దిక్కు లేకుండా!
హైదరాబాద్: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఏ మాత్రం గౌరవం లేకుండా పోయింది. ఆయన ఫొటోలను సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడ పారేశారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాలు, ఫొటోలతో సహా మీడియాలో వచ్చాయి.
ఆయన చిత్రపటం చెత్తలో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయిన తరువాత సచివాలయాన్ని కూడా రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. ఆ తరువాత సచివాలయంలో మరమ్మతు పనులు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గదుల్లో సామగ్రిని ఇష్టానుసారంగా బయటపడేస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖుల చిత్రపటాలను కూడా కనీస గౌరవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఏకంగా ఆయన చిత్రపటాన్ని చెత్తలోనే పడేశారు. చాలా రోజులుగా ఈ చిత్రపటం చెత్తలోనే ఉన్నప్పటికీ ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. చూసిన వారు మాత్రం పాపం రోశయ్య అనుకుంటున్నారు.
అత్యంత విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఖరీదైన టేకుతో తయారుచేసిన బీరువాలు, ఇతర వస్తువులు కూడా అతీగతీ లేకుండా పడిపోయి కనిపిస్తున్నాయి. వాటిని సురక్షితంగా కిందకు దించకుండా, నాలుగైదు అంతస్తుల పైనుంచే కిందకు పడేస్తుండడంతో అవి ముక్కలుగా మారిపోతున్నాయి.విభజనతో ఆర్థికంగా చితికిపోయామని చెబుతున్న అధికారులు ఈ నష్టంపై మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరించడం విచారకరం.