కవిత ప్రత్యేక దేశాలు కావాలని అడగలేదట!
హైదరాబాద్: ఇదిగో తోక అంటే అదిగో పులి మాదిరిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కాశ్మీర్, హైదరాబాద్ రాజ్యాలు భారత దేశంలో విలీనమైన అంశంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ విషయంలో వివాదమేమీ లేదని కవిత స్పష్టం చేశారు. ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు.
పార్లమెంటులో తాను ఏమీ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరో ఇద్దరు ఎంపీలతో పాటు తనను ఏ మీడియా సంస్థ చర్చగోష్టికి ఆహ్వానించిందని, కాశ్మీర్ బర్నింగ్ ఇష్యూ అని, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని తాను చెప్పానని ఆమె వివరించారు.
హైదరాబాద్, కాశ్మీరులను ప్రత్యేక దేశాలుగా ప్రకటించాలని తాను ఎప్పుడు కూడా అనలేదని ఆమె అన్నారు. ఆ రెండింటిని ప్రత్యేక దేశాలుగా ప్రకటించాలని తాను అన్నట్లుగా ఒక్క వర్గం మీడియాలో వార్తలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రక్షణ కోసం ప్రతి ఏడాది మనం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఇందులో ఎక్కువ భాగం కాశ్మీర్లోని తిరుగుబాటును, మిలిటెన్సీని అణచివేయడానికి వాడుతున్నామని, అంత పెద్ద మొత్తం ఖర్చు చేయడానికి బదులు కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే మంచిదని తాను అన్నానని ఆమె వివరించారు. అంతర్జాతీయ సరహద్దులను సరిచేసుకోవాలని తాను అనలేదని కవిత చెప్పారు.