దిండిగల్ బ్యాంక్ దోపిడీ, సినిమా ప్రేరణ...
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల సంచలనం సృష్టించిన మణప్పురం ఫైనాన్స్ దోపిడీ కేసులో దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
ఓ తమిళ సినిమా సిగరం తోడు గ్యాంగ్ జరిపే దోపిడీ ప్రేరణతోనూ, ఓ తమిళ పత్రికలో దిండిగల్ బ్యాంక్ దోపిడీకి సంబంధించి అచ్చయిన క్రైమ్ వార్తాకథనం ప్రేరణతోనూ ఏడుగురు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారని ఆయన వివరించారు. దొంగలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. మూడు నాలుగేళ్లుగా విలాసాలకు అలవాటు పడి అప్పులు చేశారు.
అప్పుల వారి నుంచి వేధింపులు పెరగడంతో చోరీకి పాల్పడ్డారని మేఘరిక్ వెల్లడించారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు దోపిడీ చేసిన ఈ గ్యాంగ్ నగదుతోపాటు బంగారాన్ని ఓ ఇంట్లో భద్రపరచినట్లు తెలిపారు. 15.800 కిలోల బంగారం, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు చిక్కినవారిలో ఎ ధనశేఖర్ (30), మోహన్ (28), రామకుమార్ అలియాస్ స్లమ్ (23), వినోద్ కుమార్ (23) ఉన్నారు. వీరంతా చూడసంద్ర క్రాస్లోని స్లమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు చెందినవారు. అక్టోబర్ 16వ తేదీన ఈ దోపిడీ జరిగింది.
దొంగతనం చేసిన బంగారు గొలుసులను విఎస్టి సురేష్, ధనశేఖర్ తమ గర్ల్ ఫ్రెండ్స్కు ఇచ్చారు. వాటిని కొనుక్కుని వచ్చి తమకు కానుకగా ఇచ్చారని గర్ల్ ఫ్రెండ్స్ నమ్మేశారు. సురేష్, విఎస్టి సురేష్ అనే ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.