అది లక్కీ చైర్: మోడీ కూర్చుంటే బిజెపి గెలుపు పక్కా!
ఉత్తరప్రదేశ్ బిజెపి నాయకులకు ఆ కుర్చి అంటే సెంటిమెంట్. ఆ కుర్చీలో నరేంద్ర మోడీ కూర్చుంటే బిజెపిదే గెలుపు అని వారు భావిస్తున్నారు.
కాన్పూర్: ఎంత ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ.. చాలా మంది సెంటిమెంట్లకు లొంగిపోతూనే ఉంటారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే వారు ఓ కుర్చీని లక్కీ కుర్చీగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 19న జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆ కుర్చీలోనే కూర్చోవాలని ప్రధాని మోడీని వారు కోరుతున్నారు.
బిజెపి నేతలు లక్కీ కుర్చీగా భావించే ఆ కుర్చీ ప్రత్యేకత ఏమిటంటే.. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఈ కుర్చీలోనే కూర్చున్నారని.. అందువల్లే తమ పార్టీ దేశవ్యాప్తంగా విజయదుందుభి మోగించిందని బిజెపి కాన్పూర్ శాఖ అధ్యక్షుడు సురేంద్ర మైథాని అంటున్నారు.
అందువల్ల డిసెంబర్ 19న నిర్వహించే ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ అదే కుర్చీలో కూర్చుంటే 2017లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికశాతం సీట్లు తమ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

ఈ నెల 19న కాన్పూర్లోని ఇందిరానగర్ మైదానంలో తొలి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నామని సురేంద్ర మైథాని చెప్పారు. విజయశంఖనాథ్ అని నామకరణంచేసిన ఈ ర్యాలీకి సుమారు ఏడు లక్షలమంది ప్రజలు వస్తున్నట్లు చెప్పారు.
గత లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రచారానికి వచ్చినప్పుడు కోయిలానగర్లో ఇదే కుర్చీలో కూర్చొన్నారనీ, అప్పుడు తమ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెల్చుకొందని తెలిపారు. ప్రధాని హోదాలో మోడీ కాన్పూర్కు రావడం ఇదే తొలిసారన్నారు. తమకు విజయం అందించిందని నమ్ముతున్నందునే ఆ కుర్చీ ఎంతో విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందువల్లే పార్టీ కార్యాలయంలో ఆ కుర్చీని గాజు గదిలో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications