అడుక్కోవాలా, నాకీ ఖర్మ ఏమిటి!: చంద్రబాబు ఆవేదన
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ నుండి సరైన హామీ రాలేదని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై చర్చించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా పైన ఆందోళన వద్దని, హోదా సున్నిత అంశమని తనకు తెలుసునని, దానిని పరిష్కరించుకుందామని చెప్పారని తెలుస్తోంది. అయితే, విభజన చట్టంలోని హామీలను త్వరలో నెరవేరుస్తామని చెప్పారు.
హోదా విషయంలో ప్రధాని మోడీ నుంచి కచ్చితమైన హామీ రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశంలో, పార్టీ సీనియర్లతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనిషిని చంపేసి క్షమాపణలు అడిగితే తప్పు మాఫీ అవుతోందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఢిల్లీలో చంద్రబాబు మాట్లాడుతూ... విభజన సందర్భంగా ఏపీకి ఏమిస్తున్నారో చెప్పలేదని, విభజన తరువాత రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో వివరించలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి పదేపదే కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ పరిస్థితి? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న తాను పదేపదే ఢిల్లీ రావాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘట్టాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. విభజనలో అన్ని పార్టీల పాత్ర ఉందన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు అయినా సరే అనుమతులు లేకుండా కట్టడానికి వీల్లేదన్నాలు. గతంలోనే తాము ఈ విషయాన్ని చెప్పామన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రాజెక్టులు కట్టుకుంటే పాలసీలు ఎందుకన్నారు.