దగ్గరకు రాని మనవడు: చంద్రబాబుకు వింత అనుభవం
విజయవాడ: తాను తన మనవడితో కూడా ఆడుకోలేకపోతున్నానని, తాను రాష్ట్రం కోసమే చిత్తశుద్ధఇతో పని చేస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు తన ఆవేదన చెబుతుండగా, మరోవైపు మంత్రి గంటా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాలనకే ప్రాధాన్యమిస్తూ ఇంటికి దూరంగా ఉంటున్న చంద్రబాబుకు ఇటీవల ఎదురైన ఓ వింత అనుభవాన్ని మంత్రి మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. గురువారం నాడు వైసిపి ప్రజాప్రతినిధుల చేరికల సందర్భంగా వేదిక మీద మాట్లాడుతూ... గంటా చెప్పిన విషయం అందర్నీ షాక్కు గురి చేసింది.
సొంత మనవడిని కూడా చూసుకోలేనంత బిజీగా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్నారని గంటా చెప్పారు. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి సుజనా చౌదరి కొడుకు వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు... ఆ కార్యక్రమం అనంతరం ఇంటికెళ్లారని చెప్పారు.
ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ను ఎత్తుకునేందుకు చంద్రబాబు చేతులు చాపారని, ఆ చిన్నారి మాత్రం చంద్రబాబు వద్దకు రాలేదని, తాత దగ్గరకు రాకపోవడమే కాక దేవాన్ష్ ఏడుస్తూ తన తండ్రి లోకేశ్ వద్దకు వెళ్లిపోయాడని, ఈ విషయాన్ని లోకేశే తనకు స్వయంగా చెప్పారని, ఇది తనను బాధించిందని గంటా చెప్పారు.
అంతకుముందు, జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... పాలనలో తలమునకలై ఏం కోల్పోతున్నారో మీకు తెలుస్తోందా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఆ తర్వాత నిజమే... మనవడితో ఆడుకునే సమయం కూడా చిక్కడం లేదని ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు చెప్పారు.