ఐటి అధికారులకు షాక్: కుక్కలను ఉసిగొల్పిన స్త్రీ
నగదు దాచారనే సమాచారం అందడంతో సోదాలకు వెళ్లిన ఐటి అధికారులకు వింత అనుభవం ఎదురైంది. అధికారులపైకి మహిళ కుక్కలను ఉసిగొల్పింది.
బెంగళూరు: నగదు దాచారనే సమాచారం అందడంతో సోదాలకు వెళ్లిన ఆదాయం పన్ను శాఖ అధికారులకు బెంగళూరులోని యశ్వంత్పూర్లో విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఐటి అధికారులపైకి మహిళ రెండు కుక్కలను ఉసిగొల్పింది. దీంతో ఐటి అధికారులు పరుగు లంకించుకున్నారు.
యశ్వంత్ పూర్ ఏరియాలోని ఓ అపార్టుమెంట్ లో కోట్లకొద్ది డబ్బు ఉందని ఆదాయం పన్ను (ఐటి) అధికారులకు సమాచారం అందింది. ఐటీ అధికారుల బృందం అపార్టుమెంట్ కు చేరుకుంది. ప్లాట్లోని ఇంట్లోకి వెళ్లటానికి అధికారులు ప్రయత్నించారు. మీరు ఎవరు రావటానికి మీకేం పని మా ఇంట్లో అంటూ అధికారులపైకి ఇంటి యజమాని ఇంట్లో పెంచుకుంటున్న రెండు కుక్కలను వదిలింది. దీంతో షాక్ కు గురైన అధికారులు పరుగులు తీశారు.
స్థానిక పోలీసుల సహకారం తీసుకున్న ఐటీ అధికారులకు ఇళ్లు మొత్తం తనిఖీ చేయగా మరో షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న గదిలో 2కోట్ల 89 లక్షల నగదు బయటపడింది. ఇందులో 2కోట్ల 25 లక్షలు కొత్త 2వేల నోట్లు కావటం విశేషం. మొత్తం డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అపార్ట్మెంట్లోని ఓ రూంలో లెక్కల్లో చూపని డబ్బును ఉంచి తాళం వేసినట్లు తెలిపారు. వాటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో లెక్కలు చూపని సొమ్ముగా గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.