'అప్పట్లో.. మంచం కింద దాక్కున్న అశోక్ గజపతిరాజును కాపాడిన జానా'
కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం చూసి ఆయన సతీమణి భయంతో కేకలు వేశారని జానారెడ్డి అన్నారు.
హైదరాబాద్: 'ఇప్పుడంటే రాజకీయాలు ఇలా తయారయ్యాయి గానీ.. అప్పట్లో..' అంటూ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. శుక్రవారం నాడు జరిగిన బీఏసీ సమావేశం సందర్బంగా.. ఆయన అప్పటి రాజకీయాలను గుర్తుచేసుకున్నారు.
'నేను టీడీపీలో ఉన్న రోజుల్లో.. జానారెడ్డి, అశోక్ గజపతిరాజు ఇంకా మరికొంతమంది నేతలం ప్రతిరోజు సాయంత్రం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవాళ్లం. ఆ రాజకీయాలే వేరుగా ఉండేవి' అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
అనంతరం కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ సీఎల్పీ నేత జానారెడ్డి గొంతు కలిపారు. కేసీఆర్ చెప్పింది నిజమే.. అంటూ అప్పట్లో తన ఇంట్లో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేశారు. అప్పట్లో.. ఓసారి అశోక్ గజపతిరాజు రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడారని, ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఆయన మీద దాడి చేయడానికి వస్తే.. ఇంట్లో మంచం కింద దాక్కున్నారని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం చూసి ఆయన సతీమణి భయంతో కేకలు వేశారని జానారెడ్డి అన్నారు. ఆ సమయంలో తాను రివాల్వర్ బయటకు తీసి కాంగ్రెస్ వాళ్లను అడ్డుకుని అశోక్ గజపతిరాజును కాపాడానని ఆయన చెప్పారు.