మహానాడులో 'బాహుబలి' లోకేష్: ఫస్ట్ డే వంటకాలివే
చిత్తూరు: శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు ప్రారంభమైంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడును ప్రారంభించారు. మహానాడు వేదిక వద్ద భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
టిడిపిలో చంద్రబాబు రాజకీయ వారసుడిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే దాదాపు ఖరారయ్యారు. అధికారికంగా ఎవరూ చెప్పనప్పటికీ ఆ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి నేతలు కూడా లోకేష్ పేరునే పలవరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణం వద్ద చంద్రబాబు ఫోటోలు, ఫ్లెక్సీతో పాటు లోకేష్, బాలకృష్ణ ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ను బాహుబలిగా చూపుతూ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది అందరినీ అలరిస్తోంది. పసుపు రంగు చొక్కాలో లోకేష్ను బాహుబలిగా చిత్రీకరించి కటౌట్ ఏర్పాటు చేశారు.
ఇక, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇది ఆయన వందో చిత్రం. ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి స్టయిల్లో వేడుకకు హాజరయ్యారు. పెద్ద మీసం కట్టు, శాతకర్ణిని తలపించే హెయిర్ స్టయిల్, తెల్లటి దుస్తుల్లో వచ్చారు.
కాగా, మహానాడు ప్రాంగణంలో అడుగడుగునా పూర్తిగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సమావేశాలు కావడంతో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ వలంటీర్లు సేవలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మూడు రోజుల బస నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఇప్పటికే పోలీసులు పలు ప్రాంతాల్లో మకాంవేసి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రాంగణ సమీపంలో ప్రధాన ఆసుపత్రులు ఉండటంతో రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. పార్కింగ్ విషయంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు.
రుచికరమైన వంటకాలు
మహానాడులో ముప్పై వేలమంది కార్యకర్తలతో పాటు ఇతర ప్రతినిధులు, మంత్రులు, పాత్రికేయులకు మూడు రోజుల పాటు నోరూరించే పసందైన శాకాహార, మాంసాహార వంటకాలను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపి మాగంటి బాబు దగ్గరుండి సిద్ధం చేయిస్తున్నారు.
మూడు టన్నుల ఆవకాయ ఊరగాయను సిద్ధం చేశారు. మెనూలో దాదాపు ముప్పై రకాల వంటకాలు ఉంటాయి. మహానాడు జరిగే మూడు రోజుల్లో శుక్రవారం, ఆదివారాల్లో మాంసాహారం, శనివారం మాత్రం శాకాహారంలోనే రకరకాల వంటకాలు వడ్డిస్తారు.
ఆంధ్రమాత గోంగూర, ఈ సీజన్ స్పెషల్ మామిడికాయ పప్పు, దప్పళం, రైతా, మామిడి పులిహోర, మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి, దోసకాయ చట్నీ, మిల్ మేకర్ గ్రేవీ కర్రీ, బీరకాయ రోటీ చట్నీ, దొండకాయ కార్న్ కోటెడ్ ఫ్రై, సంగటి, రాయలసీమ పులగోర, పచ్చిపులుసు, బిరియాని తొలి రోజు సిద్ధంగా ఉన్నాయి.
వీటితో పాటు ఫ్రూట్ సలాడ్, ఐస్క్రీంలనూ సిద్ధం చేశారు. మధ్యాహ్నం 20 వేలమందికి భోజనాలను అందించనున్నారు. ఇందుకు రామదండు పేరిట 500 మందితో వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు.