షారుక్ ఖాన్ను వెనక్కి నెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ!
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ను ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి నెట్టారు! సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో వీరిని చాలామంది అనుసరిస్తున్నారు. ఇప్పుడు షారుక్ ఖాన్ను అనుసరిస్తున్న వారి కంటే ప్రధాని మోడీని అనుసరిస్తున్న వారు ఎక్కువ అయ్యారు.
తద్వారా ప్రధాని మోడీ ట్విట్టర్లో అత్యధిక అనుచరులున్న రెండో భారతీయుడిగా నిలిచారు. ఇప్పటి వరకు ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న షారూఖ్ ఖాన్ను ప్రధాని మోడీ తాజాగా వెనక్కి నెట్టారని ట్విట్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
జనవరి 16న ప్రధాని మోడీని అనుసరిస్తున్న వారి సంఖ్య 1,73,71,600కు చేరిందని, దీంతో 1,73,51,100 మంది అనుచరులు కలిగిన షారుక్ఖాన్ మూడోస్థానానికి వెళ్లాడని వివరించింది.
అత్యధిక అనుచరులు కలిగిన భారతీయుడుగా 1.89 కోట్ల మందితో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా చాలా వేగంగా ప్రతి రెండు నెలలకు పది లక్షలమంది నూతన అనుచరులతో దూసుకుపోతోంది.
గతేడాది సెప్టెంబర్ 22న అనుచరుల సంఖ్య 1.5 కోట్లు ఉండగా నవంబర్ 20 నాటికి 1.6 కోట్లకు పెరిగింది. తాజాగా శనివారం నాటికి అది మరో పది లక్షల మంది కొత్త అనుచరులతో రెండో స్థానానికి చేరింది. 2009లో ట్విట్టర్లో చేరిన ప్రధాని మోడీ భారత్లో అత్యధిక మంది అనుచరులున్న రాజకీయ నేత. అలాగే ప్రపంచ రాజకీయ నేతల్లో రెండోస్థానంలో ఉన్నారు. ఒబామా మొదటి స్థానంలో ఉన్నారు.