సహజీవనం: హైదరాబాద్లో కామన్, ఆపై ఆత్మహత్యలు..!
హైదరాబాద్: 24 ఏళ్ల లక్ష్మీ (పేరు మార్చాం). ఐటీ కంపెనీలో ఉద్యోగం. మంచి వేతనం. తన సహచర ఉద్యోగి రమేశ్ను ప్రేమించింది. పెళ్లి కాకుండానే అతనితో సహజీవనం చేసింది. సెటిలైన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. అయితే ఈ క్రమంలో వయసు పెరగడంతో తనలోని సెక్స్ కోరికలను చంపుకోలేక అతడితో సహజీవనం చేసింది.
ఇలా కొన్ని సంవత్సరం గడిచిన తర్వాత ఆమె పెళ్లి కలలు కల్లలయ్యాయి. రమేశ్కి ఆమె అంటే ఇష్టం లేదని తన కంటే తక్కువగా చదువుకుందనే సాకుతో వదిలేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని లక్ష్మీ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఇంకేముంది తన మానాన్ని దోచుకున్నాడని గుండెబద్దలయ్యేలా ఏడుస్తూ చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుంది.
ఇది ఒక లక్ష్మీ కన్నీటి కథ. ముంబైలోనే కాదు సాప్ట్వేర్ పుణ్యమా అని మన హైదరాబాద్లో కూడా సహజీవనాలు ఎందరో అమ్మాయిలకు తీరని వ్యధలను మిగులుస్తున్నాయి. ప్రపంచ పురోగతి, మారుతున్న జీవనశైలి, ఉద్యోగాలు తదిరాలు యువతను సహజీవనం వైపు నడిపిస్తున్నాయి.
అయితే ఇందులో పెళ్లి వరకు వెళ్లేవి చాలా తక్కువ. నగరంలోని కోర్టుల పరిధిలో తాము సహజీవనం చేసి అన్నాయమై పోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ 15 మంది యవతులు వేసిన కేసులు విచారణ దశలో ఉన్నాయి. నిజానిక మన దేశ చట్టాల ప్రకారం సహజీవనానికి చట్ట బద్ధత లేదు.
దీంతో యువతీ యువకలిద్దరూ ఇష్టపూర్వకంగానే జీవనం గడిపినందుకు, అబ్బాయి చేసే మోసమేమీ లేదని కోర్టులు తీర్పిస్తుండటం యువతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని సహజీవన బాధితుల తరుపున కోర్టుల్లో వాదిస్తున్న న్యాయవాదులు వెల్లడించారు.
"మనదేశంలో ఫ్యామిలీ కోర్టుల్లో చాలా కేసుల్లో ఈ సహజీవనంపై జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి తక్కువ చదువుకుందని, కులాలు వేరని, పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని యువకులు చెబుతున్నారు. ఏ గుడిలోనో సాక్ష్యాలు లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని, ఆపై అవసరాలు తీర్చుకుని బంధాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు అంగీకరించని పరిస్థితి కూడా ఉంది. అత్యధిక కేసుల్లో అమ్మాయిలే మోసపోతున్నారు" అని ఈ ఏడాది ముగ్గురు యువతుల ఆత్మహత్యలను చూసిన న్యాయవాది అనితా జైన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అనితా జైనా మాట్లాడుతూ దేశంలో ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరమని అన్నారు. సహజీవనం కేసుల్లో యువతులకు న్యాయం జరగ్గపోవడం, అందుకు తగ్గ చట్టాలు భారత్లో లేకపోవడం కూడా మహిళల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఆమె తెలిపారు.
దీనికి తోడు కోర్టుకు వచ్చే వారిలో ఎక్కువ మంది యువతుల వద్ద సహజీవనానికి సంబంధించిన సాక్ష్యాలు లేకపోవడం ఒక కారణంగా పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి దిగిన చిత్రాలు, వీడియోలు సైతం లేకుండానే సహజీవనం చేస్తున్నవారు చాలా మంది ఉన్నారని, అందువల్లే కోర్టులు సైతం న్యాయం చేయలేకపోతున్నాయని ఆమె పేర్కొన్నారు.