ఢిల్లీలో ‘జంబలకిడి పంబ’: వాళ్లే మారిపోతున్నారు!
సీనియర్ హీరో నరేష్ నటించిన ‘జంబలకిడి పంబ’ సినిమా అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఓ ఔషధం ద్వారా ఆడవాళ్లను మగవాళ్లుగా, మగవాళ్లను ఆడవాళ్లగా మార్చేస్తారు.
న్యూఢిల్లీ: సీనియర్ హీరో నరేష్ నటించిన 'జంబలకిడి పంబ' సినిమా అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఓ ఔషధం ద్వారా ఆడవాళ్లను మగవాళ్లుగా, మగవాళ్లను ఆడవాళ్లగా మార్చేస్తారు. అయితే, ఆ సినిమాలో ఎవరో కావాలని ఇలా చేస్తారు.. కానీ, ఇక్కడ మాత్రం స్వయంగా కావాలనే కోరికతో మగ వాళ్లు ఆడవాళ్లలా, ఆడవాళ్లు మగవాళ్లలా మారిపోతున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో జరుగుతున్న ఈ లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు భారీస్థాయిలో పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిపోతున్న క్రేజ్
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో ఐదుగురు లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు వేచి ఉన్నారు. ఈ లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే వారి సంఖ్య పెద్దది కాకపోయినా ఇటీవల ఢిల్లీ నగరంలో ఈ ఆపరేషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇద్దరు ఇంజనీర్లు, ఒక వైద్య విద్యార్థి ఈ శస్త్రచికిత్స చేయించుకునేందుకు వేచి ఉన్నారు. కాగా, ఇలాంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు వస్తున్న వారిలో ఎక్కువమంది మధ్య తరగతి వారేనని ఢిల్లీ ఆస్పత్రి ప్లాస్టిక్ శస్త్రచికిత్స విభాగానికి చెందిన డాక్టర్ పిఎస్ భండారీ చెప్పారు.
ఆరు నెలల్లో మార్పులు
పది సంవత్సరాల క్రితం, ఒక ఏడాదిలో ఒకటి లేదా రెండు కేసులు వచ్చేవని.. కానీ ఇప్పుడు, ప్రతి నెలలో మూడు నుంచి నాలుగు సెక్స్ మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటామనే అభ్యర్థనలు వస్తున్నాయని మనోవ్యాధి వైద్యుడు డాక్టర్ రాజీవ్ మెహతా చెప్పారు. ఈ క్రమంలో ఇలా సెక్స్ మార్పిడి శస్త్రచికిత్సకు ముందు ఆరు నెలలు తమ వేషధారణ, నడవడిక మారాలనుకునే లింగం లాగా మారాలని వైద్యులు రోగులకు సూచిస్తుండటం గమనార్హం.
అబ్బాయిగా మారిన అమ్మాయి
ఇటీవల నోయిడాకు చెందిన 27 ఏళ్ల అమ్మాయి తాను అబ్బాయిగా మారాలనుకొని అబ్బాయిలాగానే వ్యవహరించింది. ఈ అమ్మాయి హాఫ్ బాటిల్ విస్కీ తాగటంతోపాటు రోజుకు 20 సిగరెట్లు పీల్చేసింది. దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేసి యోనితోపాటు వక్షోజాలను తొలగించి అంగాన్ని ఏర్పాటు చేశారు. టెస్టోరాన్ థెరపీ ద్వారా అమ్మాయి కాస్తా అబ్బాయిగా మారింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బారులు
కాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ మార్పిడి చికిత్సకు రూ. లక్షలు అవసరమవుతుండటంతో ఎక్కువగా లోక్ నాయక్ లాంటి ప్రభుత్వ ఆస్పత్రులనే లింగమార్పిడి కోరుకునేవారు సంప్రదిస్తున్నారని డా. సమీర్ మల్మోహత్రా తెలిపారు. ఇలాంటి కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటీవల కాలంలో పెరిగపోయాయని చెప్పారు. ఇందుకు కోసం చాలా మంది వేచిచూస్తున్నారని చెప్పారు. జంబలకిడి పంబ సినిమాలో పురుషాధిక్యాన్ని తగ్గించేందుకు ఓ ఔషధం ద్వారా మార్పు చేస్తే.. ఇక్కడ మాత్రం ఎవరికి వారే ఏదో ఓ కారణం చేత లింగమార్పిడి చేసుకుంటుండటం గమనార్హం.