లావు రత్తయ్య ఫెయిల్: జగన్ హామీతో తనయుడి జోష్
విజ్జాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్యకు రాజకీయాలకు కలిసి రావడం లేదు. అయితే, ఆయన కుమారుడు కృష్ణదేవరాయలు మాత్రం జోష్ మీద ఉన్నారు.
గుంటూరు: విజ్జాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్యకు రాజకీయాలకు కలిసి రావడం లేదు. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆయన కుమారుడు కృష్ణదేవరాయలు మాత్రం జోష్ మీద ఉన్నారు.
కృష్ణదేవరాయలు గుంటూరు లోకసభ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. లావు రత్తయ్య ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు.
పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి రాకపోవటంతో ఆయన రాజ్యసభకు వెళ్లే అవకాశం చేజారిందని అంటున్నారు.
టిడిపి నుంచి పోటీ చేస్తారని..
లావు రత్తయ్య 2014 ఎన్నికలకు ముందు గుంటూరు లోకసభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆయన అందుకు ఇష్టపడలేదు. ఆ తరువాతే పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పేరు వచ్చింది, ఆయన పోటీ చేశారు.
ఆ సీటు ఆశించారని....
లావు రత్తయ్య తెలుగుదేశం పార్టీ నుంచి నరసరావుపేట సీటు ఆశించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పటి వరకు కాంగ్రెస్లో ఉండి గుంటూరు ఎంపీగా కొనసాగుతున్న రాయపాటి సాంబశివరావు టిడిపిలో చేరి ఆ సీటు దక్కించుకుని, పోటీ చేసి విజయం సాధించారు. దాంతో రత్తయ్య మాజీ ఎంఎల్ఏ రావి వెంకటరమణ ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరినప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు రత్తయ్య దూరంగా ఉంటూ వచ్చారు.
తండ్రి ఆశీస్సులతో...
తండ్రి లావు రత్తయ్య ఆశీస్సులతో కృష్ణదేవరాయలు కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే వైసీపీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథి పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడంతో కృష్ణదేవరాయలకు కలిసి వస్తున్నట్లు చెబుతున్నారు. అధికారికంగా నియోజకవర్గ ఇన్చార్జిగా అయన పేరు ప్రకటించనప్పటకీ లోక్సభ స్థానం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమన్వయకర్త పేరుతో వ్యవహారాలు నడుపుతున్నారు.
ఇలా చురుగ్గా..
ఇటీవల నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో వైసీపీ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకల్లో కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. బుధవారం గుంటూరులో జరిగిన తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన గుంటూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
ఆ చరిత్ర బాలశౌరిది...
గుంటూరు జిల్లాలోని మూడు లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసిన చరిత్ర బాలశౌరికి ఉంది. 2004లో తెనాలి (అప్పటికి రద్దు కాలేదు) లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. 2009 ఎన్నికల నాటికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి లోక్సభ స్థానం నియోజకవర్గాల పునర్విభజనలో రద్దు అయింది. దాంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనకు నర్సారావుపేట టికెట్ ఇప్పించారు.
మేకపాటి నెల్లూరుకు...
బాలశౌరి కోసం నరసరావుపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిని నెల్లూరుకు పంపి అక్కడ నుంచి బాలశౌరిని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరిన బాలశౌరి 2014 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో ఓటమిని చవి చూశారు. ఆయన బాపట్ల నుంచి పోటీ చేస్తారా, నర్సారావుపేట నుంచి బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది.