బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది: కస్టమర్కు ఓలా రూ.149కోట్ల బిల్లు..
ఓలా వేసిన బిల్లును చూసి కస్టమర్ కంగారెత్తిపోయాడు. వెంటనే ఓలా సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయగా.. సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చే ప్రయత్నం చేశారు.
న్యూఢిల్లీ: జస్ట్ 300మీటర్లు ప్రయాణం చేసినందుకు గాను ఓలా కంపెనీ ఓ ప్రయాణికుడికి రూ.149కోట్ల బిల్లు వేసింది. దీంతో కంగు తిన్న కస్టమర్.. విషయమేంటా అని ఆరా తీస్తే.. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందంటూ ఓలా కంపెనీ సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. సరిగ్గా ఏప్రిల్ 1వ తేదీనే ఈ ఘటన జరగడంతో.. కస్టమర్ ను ఓలా పెద్ద ఫూల్ చేసిందన్న ఛమత్కారాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ ఫోన్ స్విచ్చాఫ్ అవడంతో.. కస్టమరే క్యాబ్ ను వెతుక్కుంటూ వచ్చాడు. తీరా క్యాబ్ ఎక్కి ఓ 300మీటర్లు అలా ముందుకెళ్లిందో లేదో.. ఆ తర్వాత ఆగిపోయింది. కారణమేంటని అడిగితే.. ఓలా నుంచి అప్పటికే ఆ కస్టమర్ కు వచ్చిన మెసేజ్ చూసుకోమన్నాడు. అందులో రూ..1,49,10,51,648 బిల్లు ఇంకా పెండింగ్ లొ ఉందని పేర్కొనబడింది.
దీంతో ఆ బిల్లును చూసిన కస్టమర్ కు గుండె ఆగినంత పనైంది . వెంటనే ఓలా సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయగా.. సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే సదరు కస్టమర్ ఖాతాలోంచి రూ.120 కూడా కట్ అయిపోయాయి. ఏదేమైనా ఏప్రిల్ ఫస్ట్ నాడు కస్టమర్ ను ఓలా ఫూల్ చేసిందని దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్స్.