ఏమవుతోంది: మంత్రులు మౌనం, చంద్రబాబు ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. వివాదాలపై వారు నోరు మెదపడం లేదు. మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకపోతే ఏమవుతుందో తెలియని అయోమయ పరిస్థితిని వారు ఎదుర్కుంటున్నారు.
అయితే, మంత్రుల మౌనంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. వివాదాలు ముసిరినప్పుడు ప్రతిస్పందించాల్సన బాధ్యత మంత్రులపై ఉందని ఆయన అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు వ్యాఖ్యలు...
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అంతేకాకుండా బిజెపికి పుండు మీద కారం చల్లినట్లుగా కూడా ఉన్నాయి. విభజన సమస్యలను పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్తామని తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి.
దానిపై ముదిరిన వివాదం...
చంద్రబాబు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దాన్ని ఓ అస్త్రంగా ఎంచుకున్నారు. ప్రభుత్వమే చంద్రబాబుదని, అటువంటప్పుడు తన ప్రభుత్వంపైనే చంద్రబాబు కోర్టుకు వెళ్తారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తప్పు పట్టే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి బాగస్వామిగా ఉంది.
సమాచార లోపం వల్లనే...
సమాచార లోపం వల్లనే తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై మంత్రులు తగిన సమయంలో స్పందించకపోవడం వల్ల వివాదం ముదిరిందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై తమకు స్పష్టత లేదని అంటున్నారు.
చంద్రబాబు వివరణ ఇచ్చేదాకా...
తన ఉద్దేశం అది కాదని చంద్రబాబు వివరణ ఇచ్చే వరకు మంత్రులు ఎవరు కూడా దానిపై స్పందించలేదు. చంద్రబాబు ఉద్దేశం అది కాదని చెప్పడానికి మంత్రులు ముందుకు రాలేదు. అది చంద్రబాబు ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.
పోలవరం విషయంలో కూడా...
పోలవరం విషయంంలో కూడా మంత్రులు సరిగా స్పందించలేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలపై, అమరావతి నిర్మాణంపై ఎదురవుతున్న ప్రశ్నలకు, విమర్శలకు కూడా మంత్రులు సరైన రీతిలో ప్రతిస్పందించడం లేదని చంద్రబాబు భావిస్తున్నారు.
పార్టీ పనిగట్టుకుని తోస్తే...
తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే తప్ప మంత్రులు తమంత తాముగా ఏ విషయం మీద కూడా స్పందించడం లేదని అంటున్నారు. మంత్రులను ఎవరూ గైడ్ చేయాల్సిన అవసరం లేదని, ప్రజలు వారిపై విశ్వాసం ఉంచారని, అందువల్ల వారు అన్ని విషయాలపై చురుగ్గా ప్రతిస్పందించాల్సి ఉంటుందని చంద్రబాబు అంటున్నారు.
చంద్రబాబు హెచ్చరిక...
మన్ను తిన్న పాముల్లా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు మంత్రులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి విషయం మీదా తానే ముందుకు వచ్చి చెప్పాలంటే కుదరని విషయమని, మంత్రులు చొరవ ప్రదర్శించాలని ఆయన చెబుతున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయితే ఇలా అవుతోంది...
గతంలో పవన్ కల్యాణ్ విషయంలో గానీ బిజెపి విషయంలో గానీ ప్రతిస్పందించనందుకు పార్టీ నాయకులు చంద్రబాబు నుంచి మొట్టికాయలు తిన్నారు. బిజెపి ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చినందుకు రాజేంద్రప్రసాద్పై చంద్రబాబు గుర్రుమన్నారు. ఏది మాట్లాడితే ఏమవుతుందో తెలియని వాతావరణంలోనే మంత్రులు మౌనం వహిస్తున్నట్లు చెబుతున్నారు.