జగన్ ధీమా ఇదీ: చంద్రబాబు సంతృప్తి కోసమేనా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన జరగదనే ధీమాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తనకు తనకు సమాచారం ఉందని ఆయన తనను కలిసేందుకు వచ్చిన నాయకులతో ఆయన చెబుతున్నట్లు సమాచారం.
జగన్ ఇలా చెబుతున్నారు...
ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ను పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల నేతలు కలుస్తున్నారు. ఢిల్లీ నుంచి తనకు పక్కా సమాచారం ఉందని, పునర్విభజన జరగదని జగన్ వారికి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంత వరకు మాత్రమే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరిచేందుకు కేంద్రం నియోజవర్గాల పునర్విభజన చేపడుతోందని, అయితే ఆ ప్రక్రియ పూర్తి కాదని జగన్ అంటున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుందని, తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చకు పెడుతుందని, దాంతోనే ప్రక్రియ ఆగిపోతుందని జగన్ వివరిస్తున్నట్లు తెలుస్తోంది.
దాన్ని కాంగ్రెసు వ్యతిరేకిస్తుంది...
పునర్విభజన ప్రక్రియను పార్లమెంటులో కాంగ్రెసు వ్యతిరేకిస్తుందని జగన్ తన పార్టీ నాయకులతో చెబుతున్నారు. అందువల్ల నియోజకవర్గాలు పెరుగుతాయనే భయం అక్కర్లేదని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. లోకసభ ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.
లోకసభకు ముందస్తు ఎన్నికలు...
లోకసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని, అక్టోబర్ లేదా నవంబర్ నెలలో లోకసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. నిరుటి నుంచి ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్న వైసిపి ఎంపి ఒక్కరు బిజెపి నాయకత్వంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. బిజెపి సహా మిగిలిన జాతీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలను కూడా ఆయన చూస్తున్నారు.ఆయన ద్వారా ఢిల్లీ సమాచారం జగన్కు ఎప్పటికప్పుడు అందుతున్నట్లు చెబుతున్నారు.