దుర్గగుడిలో తాంత్రిక పూజల ఎఫెక్ట్: క్యాబినెట్ నుంచి మాణిక్యాల రావు ఔట్?
అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామాత గుడిలో అర్ధరాత్రి 'తాంత్రిక పూజలు' నిర్వహించిన వార్తలపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారని తెలుస్తోంది. ప్రత్యేకించి యువ నాయకుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు ఉజ్వల భవిష్యత్ కోసమే ఈ పూజలు నిర్వహించారని వార్తలొస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
అదే విధంగా మంత్రి మాణిక్యాల రావును తనను కలుసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. కడపలోని పులివెందులలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు బుధవారానికి విజయవాడకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును కలుసుకున్న తర్వాత మంత్రి మాణిక్యాల రావును రాజీనామా చేయాలని కోరనున్నారని తెలుస్తోంది.
బీజేపీ - టీడీపీ మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం
‘తాంత్రిక పూజల'పై తీవ్ర ఆరోపణలతో ప్రభుత్వం ఒత్తిడికి గురవుతుండటంతో నైతిక బాధ్యత పేరిట రాజీనామా చేయాలని చంద్రబాబు కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మాణిక్యాల రావు తన పదవికి రాజీనామా చేస్తే.. ఇప్పటికే అస్తుబిస్తుగా ఉన్న బీజేపీ - టీడీపీ సంబంధాలు మరింత బెడిసికొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నారని తెలుస్తున్నది. 2014 జూన్ ఎనిమిదో తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు తన క్యాబినెట్లోకి బీజేపీ నేతలు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లను తీసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతల్లో మాణిక్యాల రావు కూడా ఉన్నారు. మాణిక్యాల రావుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు.
సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎంఓ ఆదేశం
అంతకముందు కనకదుర్గ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ సూర్యకుమారిని ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం బదిలీ చేశారు. ఆమె కేవలం చంద్రబాబుకు అనుకూలమైన అధికారులు, ఆయన సొంత సామాజిక వర్గం వారికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత వివాదం నేపథ్యంలో కుల సమీకరణాల కారణంగా ఆమెను రక్షించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె స్థానంలో సింహాచలం కార్య నిర్వహణాధికారి రామచంద్ర మోహన్ ను నియమించడమే దీనికి కారణం. దీంతోపాటు దుర్గాగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై సమగ్రంగా నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ అధికారులను సీఎంఓ ఆదేశించినట్లు సమాచారం.
ప్రభుత్వంలో కీలక వ్యక్తుల ఆదేశం మేరకే పోలీసుల అదుపులో సృజన్
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీఎం చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు రాజయోగం దక్కడం కోసం కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశామని సృజన్ అనే అర్చకుడు తమకు చెప్పాడని ఆయన సన్నిహితులు, బంధు మిత్రులు చెప్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని వెలుగులోకి రావడంతో అది నిజమేనని అర్థమైందని సృజన్ సన్నిహితులు, బంధువులు అంటున్నారు. నారా లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు చేశామని సృజన్ చెప్పడం... ఆ తరువాత అతడు కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వ్యూహం ప్రకారమే వారు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆచూకీ కనిపించని సృజన్.. నోరు విప్పని పోలీసులు
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివేరు వాసి అర్చకుడు సృజన్. అక్కడ శివాలయంలో పనిచేస్తున్నాడు. ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 26న అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేసినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. స్మార్త వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచాన్ని తొలగించి, మహిషాసురమర్థినిగా అలంకరణ చేసింది సృజనే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి అతని అచూకీ తెలియడం లేదు. విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు నోరువిప్పడం లేదు. విజయవాడలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలో సృజన్ను ఉంచినట్లు తెలుస్తోంది.