బిజెపిలోకి గాలి జనార్దన్ రెడ్డి: బళ్లారి నుంచే పోటీ?
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీకి చేరువైనట్లు చెబుతున్నారు. మే 12వ తేదీన కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి స్థానిక మీడియాలో ఆసక్తికర వార్తాకథనం ప్రచురితమైంది.
అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో బిజెపి టికెట్పై పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతం ఇవ్వడానికి కారణం కూడా ఉంది.
ఆయన సోదరుడి మాట
అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి బిజెపి టికెట్పై పోటీ చేస్తారని ఆయనయ సోదరుడు సోమశేఖర రెడ్డి చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. జనార్దన్ రెడ్డి బళ్లారి నుంచి పోటీ చేస్తారని కూడా ఆయన చెప్పారు.
అయితే ఎటు వైపు నుంచీ....
గాలి జనార్దన్ రెడ్డి తమ పార్టీ టికెట్పై పోటీ చేస్తారనే వార్తలపై బిజెపి నుంచి అధికారిక సమాచారమేదీ లేదు. గాలి జనార్దన్ రెడ్డి నుంచి కూడా అధికారికమైన సమాచారం లేదు. తాము బిజెపితో ఉన్నట్లు గాలి సోదరులు ఇద్దరు కూడా చెబుతూ వస్తున్నారు. దానిపై పార్టీ ఏమీ మాట్లాడడం లేదు.
42 నెలలు జైలులో గాలి...
మైనింగ్ కుంభకోణాల కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి 42 నెలల పాటు జైలులో ఉన్నారు. గాలి సోదరులు బళ్లారిలో పెద్ద యెత్తున పలుకుబడి పెంచుకున్నారు. అది వారికి పెట్టని కోటగా ఉంటూ వస్తోంంది. అయితే, వారు బిజెపిలో ఉన్నారా లేరా అనేది తెలియడం లేదు. బిజెపి నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
కాగా, యడ్యూరప్ప ఇలా..
నిరుడు నవంబర్లో గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లికి ముందు రోజు కర్ణాటక ప్రస్తుత బిజెపి అభ్యర్థి యడ్యూరప్ప వివాహ వేదిక వద్ద కనిపంచారు. మర్యాదపూర్వకంగా మాత్రమే యడ్యూరప్ప అక్కడికి వెళ్లారని అప్పట్లో భావించారు. అయితే మర్నాడు వివాహానికి కూడా యడ్యూరప్ప హాజరయ్యారు. దాంతో గాలి జనార్దన్ రెడ్డితో బిజెపి తిరిగి సంబంధాలు నెలకొల్పుకోవాలని చూస్తుందా అనే ప్రశ్నలు అప్పట్లో ముందుకు వచ్చాయి.