వర్షం పడుతుంటే క్రిస్పీగా, సూపర్ టేస్టీగా సగ్గుబియ్యం వడలు.. ఇలా చేసి రుచి చూడండి
వర్షం పడుతుంటే ఏదైనా వేడివేడిగా తినాలని అనుకుంటాం. అయితే ఆరోగ్యాన్ని ఇచ్చేవి తింటే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. బయట ఇష్టారాజ్యంగా కల్తీ నూనె, కల్తీ పదార్ధాలతో తయారుచేసినవి ఆరోగ్యాన్ని ఇవ్వవు. అందుకే సింపుల్ గా తక్కువ సమయంలో ఆరోగ్యకరంగా ఉండే స్నాక్స్ తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది.
కరకరలాడే సగ్గుబియ్యం వడలు
ఈరోజు మనం సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కరకరలాడే సగ్గుబియ్యం వడలు పక్కా కొలతలతో చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి నోటికి కరకరలాడుతూ సూపర్ గా అనిపించే సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: ఒక కప్పు మూడు గంటలు నానబెట్టుకోవాలి
ఉడికించిన ఆలుగడ్డ : 2 మెత్తగా మ్యాష్ చేసుకున్నవి
పల్లీలు: అరకప్పు దోరగా వేయించి పొడి చేసుకున్నవి
పచ్చిమిర్చి: నాలుగు సన్నగా తరిగినవి
జీలకర్ర: ఒక స్పూను
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వడలు వేయించడానికి కావలసినంత
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు, పల్లీల పొడి వేసి బాగా కలపాలి. అందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి నూనె వేడి చెయ్యాలి.
ఇలా చేస్తే సగ్గుబియ్యం వడలు సూపర్ రుచి
నూనె కాగాక పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి అరచేతిలో వడలుగా పల్చగా వత్తుకోవాలి. ఆ ఒత్తుకున్న వడలను నూనెలో వేసి, మీడియం ఫ్లేమ్ పైన రెండువైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడి వేడి సగ్గుబియ్యం వడలు రెడీ అయినట్టే. వీటిని టమాటా సాస్ తో తింటే చాలా బాగుంటాయి. వర్షం పడుతున్న వేళ ఇంట్లో వేడివేడిగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తినడానికి ఇవి బెస్ట్ ఛాయిస్.













Click it and Unblock the Notifications