ఎవరు యదార్థ స్థితిని గ్రహిస్తారు, ప్రజ్ఞకు, కాలానికీ ఏం సంబంధం?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు.
మల్ల దేశ రాజధాని కుశీ నగరం సమీపంలో ఒక ఆరామం ఉంది. వినయధరుడు అనే పెద్ద భిక్షువు ఆ ఆరామంలో ఆచార్యుడు. పదిమంది చిన్న భిక్షువులు ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయన వారికి ధర్మ విద్యలు చాలా నేర్పాడు. తనకు తెలిసిందంతా ఉపదేశించాడు. 'మీరు ఇక నాతో సరిసమానులే!' అని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకోలు కొందరిలో అహాన్ని పెంచింది. 'ఇక మనం కూడా గురువుగారితో సమానులమే!' అని అనుకున్నారు.
ఒక రోజున గురువు ఒక రేగు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఈ అహంకార శిష్యులు అక్కడికి వెళ్ళి, రేగు చెట్టు కాండాన్ని గీకుతూ ''ఇక ఈ చెట్టు సారం అయిపోయింది!'' అంటూ గురువుగారిని ఉద్దేశించి హేళనగా మాట్లాడారు. ఈ విషయం గమనించిన గురువు తన శిష్యుల్ని దారికి తీసుకురావాలనుకున్నాడు.

వారిని దగ్గరకు పిలిచి ''భిక్షువులారా! మీరు ఎంతో జ్ఞానాన్ని పొందారు. మంచిది. మీ జ్ఞానం ఏపాటిదో తెలుసుకోవాలని ఉంది. నాది ఒక ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వగలరా?'' అని అడిగాడు. ''ఓ! భంతే! తప్పకుండా'' అన్నారు వారు ధైర్యంగా, గర్వంగా. ''మంచిది. సంతోషం. నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. కాలం అనేది సర్వ భూతాల్నీ తింటుంది. చివరకు తనను తాను కూడా తింటుంది. మరి, ఈ కాలాన్ని కాల్చుకు తినే నిప్పు ఒకటుంది. అది ఏది? ఆ నిప్పును కూడా దిగమింగే అగ్ని ఒకటుంది. ఆ అగ్ని ఏది?'' అని అడిగాడు. శిష్యులు తలలు పట్టుకున్నారు. వారికి సరైన సమాధానం తోచలేదు.
''నాయనా! తొందరలేదు. ఇప్పటికిప్పుడే చెప్పనవసరం లేదు. మీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నా. వెళ్ళండి. ఆలోచించండి. వచ్చి చెప్పండి అని గురువు వారిని పంపాడు. శిష్యులు సిగ్గుతో తలవాల్చి, ఆలోచిస్తూ వెళ్ళిపోయారు. వారం రోజుల తరువాత తిరిగి వచ్చి- ''భంతే! మమ్మల్ని క్షమించండి. మా అజ్ఞానాన్ని మన్నించండి'' అని నమస్కరించి నిలబడ్డారు. ''సరే! సమాధానం చెప్పడానికి ఒక దారి చూపిస్తాను. వినండి. ప్రతి ఒక్కరికీ ఒక మెడ ఉంటుంది. ఆ మెడ మీద ఒక తల ఉంటుంది. ఆ తలలో ఎన్నో అవయవాలు ఉంటాయి. తలమీద వెంట్రుకలు ఉంటాయి. కానీ తలకు విలువను తెచ్చేవి అవేవీ కావు. తలకు విలువ తెచ్చేది ఏది? అసలు తలలో ఉండాల్సింది ఏది?'' అని అడిగాడు. శిష్యులు నిలువు కాళ్ల మీద నిలబడి, నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయారు. నోరు మెదపలేదు. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపారు.
మీకు లేనిది అదే! అది ఉంటే అహం ఉండదు. అదే ప్రజ్ఞ. ప్రజ్ఞ ఉంటేనే తలకు విలువ!''
''మరి ప్రజ్ఞకూ, కాలానికీ సంబంధం?''
''కాలాన్ని కూడా కాల్చుకు తినే నిప్పురవ్వ మనలోని కోరిక లేదా తృష్ణ. తృష్ణను కాల్చే అగ్ని ప్రజ్ఞ మాత్రమే! ప్రజ్ఞ ఉన్నవాడికే తృష్ణాక్షయం కలుగుతుంది. ప్రజ్ఞ ఉన్నవాడు వివేచనతో కోరికల్ని జయించగలడు. అతడే జితేంద్రియుడవుతాడు. జితేంద్రియుణ్ణి ఏ కోరికా తాకలేదు. సర్వ భూతాల్నీ- అంటే సమస్త భౌతిక ప్రపంచాన్నీ భక్షించే కాలం కూడా చివరకు తనను తాను భక్షించుకుంటుంది. గతాన్ని భక్షించి వర్తమానంగా, వర్తమానాన్ని భక్షించి భవిష్యత్తుగా మారిపోతూ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు. కాబట్టి మీరు జ్ఞానులుగా కదు, ప్రాజ్ఞులుగా మారండి. అహంకారంతో, స్వాతిశయంతో మూర్ఖులు కాకండి. శీలవంతమైన జ్ఞానమే ప్రజ్ఞ అని తెలుసుకోండి. అలా నడుచుకోండి'' అని చెప్పాడు.
శిష్యులు వంగి, మోకాళ్ళ మీద కూర్చొని, మన్నించమని ప్రార్థించారు. అణకువగా మెలిగి, అనతికాలంలోనే ప్రాజ్ఞులు కాగలిగారు.












Click it and Unblock the Notifications