కేశూభాయి రాజీనామా
అహ్మదాబాద్ః గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్ బుధవారం తమ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ అగ్రనాయకత్వంతో చర్చల సందర్భంగా రాజీనామాకు మొరాయించిన కేశూభాయి చివరకు లొంగివచ్చారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆయన రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ సుందర్సింగ్ భండారికి తన రాజీనామా లేఖను అందజేశారు.
కేశూభాయ్ పటేల్ రాజీనామాకు గవర్నర్ ఆమోదించారని అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా కోరారని రాజ్భవన్ వర్గాలు చెప్పాయి. పటేల్ 1998 మార్చి 4న రెండో విడత గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత 1995 మార్చిలో తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠమెక్కిన పటేల్ అసమ్మతి కారణంగా అదే ఏడాది అక్టోబర్లో గద్దె దిగారు.
రాజీనామాకు అంగీకరించడంతో పాటు తన వారసునిగా బిజెపి ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడి పేరును కూడా ఆయన ఒప్పుకున్నారు. అగ్రనేతల జోక్యంతో కేశూభాయ్, మోడి మధ్య విభేదాలు కూడా తొలిగిపోయాయి. మోడిని తన వారసునిగా కేశూభాయ్ అంగీకరించిన తర్వాత మోడి స్వయంగా కేశూభాయ్ని కలుసుకుని పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.