Home
Posted on 04-11-03
న్యూఢిల్లీ: నక్సల్స్ అణచివేతకు కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి, ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చెప్పారు. రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరల్స్ సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు.
నక్సలైట్ల అణచివేతకు నిర్దిష్ట వ్యవస్థ అవసరమని, అందుకు సిఆర్పిఎఫ్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని, ఈ విభాగం బలగాలు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రత్యేక పోలీసు విభాగాలతో కలిసి పని చేస్తాయని ఆయన చెప్పారు. నక్సల్స్ సమస్య తీవ్రరూపం దాల్చిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై దాడి నక్సల్స్ సమస్య తీవ్రతను తెలియజేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబుపై దాడి నక్సల్స్ ఎంతకైనా తెగించగలరనే విషయాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి తర్వాత నక్సల్స్ అణచివేతకు కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. నక్సల్స్ దేశంలోని 12 రాష్ట్రాల్లో విస్తరించారని, నేపాల్ మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్నారని, అత్యధునాతన ఆయుధాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారని ఆయన అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడం ద్వారా యువత తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
