Home
Posted on 08-11-03
హైదరాబాద్: ముందస్తు శాసనసభ ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఊహాగానాలు చెలరేగాయి. అయితే అందుకు సంబంధించిన చర్చనే సమావేశంలో జరగలేదని మంత్రి చెప్పారు.
మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి విలేకరులకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు 2004లో జరుగుతాయని ఆయన అన్నారు. అయితే మంత్రివర్గ సమావేశంలో చేనేత, మత్స్య కార్మికులపై వరాల వర్షం కురిపించింది. చేనేత కార్మికుల సంక్షేమానికి 356 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మత్స్యకార్మికుల గృహ నిర్మాణానికి 39 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో రెండు వైద్య కళాశాలు, రెండు డెంటల్ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. విశాఖలో పారిశ్రామికాభివృద్ధికి 502 కోట్లు విడుదల చేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.