ముందస్తు ఎన్నికలకు దేశం తీర్మానం
Posted on 13-11-03
హైదరాబాద్: ముందస్తుఅసెంబ్లీకి ఎన్నికలకు పోవాలని నిర్ణయిస్తూ తెలుగుదేశంసర్వప్రతినిధి సభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో గత కొద్ది కాలంగా ముందస్తుఅసెంబ్లీ ఎన్నికలపై జరుగుతున్న ఊహాగానాలకు తెర పడినట్లయింది.
గడువు కన్నా ముందుగానే శాసనసభకు ఎన్నికలకు పోవాలనే నిర్ణయం తీసుకునేందుకే గురువారం తెలుగుదేశంసర్వప్రతినిధి సభ ఏర్పాటయింది. ఈ రాజకీయ తీర్మానాన్ని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ ప్రతిపాదించగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత బలపరిచారు. ఇంకా గడువు ఉన్నప్పటికీ వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల తీర్పును ముందుగానే కోరాలని తాము కోరుకుంటున్నట్లు దేవేందర్ గౌడ్ తన రాజకీయ తీర్మాన ప్రసంగంలో చెప్పారు. ఆయన కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్సలైట్ల సిద్ధాంత ఆచరణను తప్పు పట్టారు.
రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు తప్పవనేవిషయాన్ని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అంతకు ముందు తన ప్రారంభోపన్యాసంలో సూచనప్రాయంగా తెలియజేశారు. ఇది చారిత్రక సమావేశమని, అత్యవసర పరిస్థితిలో ఈ సమావేశం జరుగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన ప్రధాన నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం జరుగుతోందని ఆయన అన్నారు.
కీలకమైన రాజకీయ నిర్ణయంపై ఉదయం పోలిట్బ్యూరో సమావేశంలో చర్చించామని, అయితే పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఆ నిర్ణయం తీసుకోవాలని పోలిట్ బ్యూరో నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ముందుమీ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకున్నామని ఆయన పార్టీ ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications
