ఎన్కౌంటర్ పాపం నాది కాదు: గంగన్న
కరీంనగర్: నిజామాబాద్ జిల్లా మానాల ఎన్కౌంటర్తో తనకు ఏ విధమైన ప్రమేయం లేదని మాజీ మావోయిస్టు గంగన్న స్పష్టం చేశారు. గంగన్న కోవర్టుగా మారి మానాల ఎన్కౌంటర్కు కారణమయ్యాడని సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్లు ఆరోపించారు. ఆరోపణను గంగన్న ఖండించాడు. ప్రస్తుతం గంగన్న మెట్పల్లి పోలీసు స్టేషన్లో ఆశ్రయం పొందాడు. గంగన్న ఏడాది క్రితం పోలీసులకు లొంగిపోయి తిరిగి మూడు నెలల క్రితం మావోయిస్టులలో కలిశాడు.
గత నెల 22వ తేదీన జరిగిన కోరుట్ల ఎన్కౌంటర్ నుంచి తాను, వసంత, నరేంద్ర తప్పించుకుని పారిపోయామని, ఆ తర్వాత తాను ఐదవ తేదీ వరకు బంధువుల ఇళ్లలో తలదాచుకుని పోలీసులకు లొంగిపోయాయని, ఏడవ తేదీన మానాల ఎన్కౌంటర్ జరిగిందని, పోలీసులకు లొంగిపోయిన తనకు నక్సలైట్ల కదలికలు తెలిసే అవకాశం లేదని గంగన్న అంటున్నాడు. గంగన్నకు మానాల ఎన్కౌంటర్తో ఏ విధమైన సంబంధం లేదని డియస్పి వెంకటనారాయణ అన్నారు. మానాల ఎన్కౌంటర్లో మరణించినవారిని గుర్తు పట్టడానికి మాత్రమే పోలీసుల వెంట వచ్చాడని, అంతకు మించి గంగన్నకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.