వైయస్ తోడల్లుడి ప్రాజెక్టుపై లోక్సభలో రభస
న్యూఢిల్లీ: రాజోలిబండ మళ్లింపు పథకం ( ఆర్డీయస్)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు సుబ్బారెడ్డి నిర్మిస్తున్న మినీ విద్యుత్ ప్రాజెక్టుపై సోమవారం లోక్సభ వివాదం చెలరేగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
తుంగభద్ర నీటిని కర్ణాటక ఇప్పటికే అక్రమంగా వాడుకుంటోందని, ఆర్డీయస్పై విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్కు మరింత అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం సభ్యుడు కె. ఎర్రంనాయుడు సభ దృష్టికి తెచ్చారు. అయితే ఎర్రంనాయుడు వ్యాఖ్యలను కర్ణాటకకు చెందిన లోక్సభ సభ్యులు తేజస్విని, అనంతకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎర్రంనాయుడు అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారన్నారు. ఈ సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సభ్యుల వివాదం చెలరేగింది. ఈ విషయంపై మట్లాడడానికి రేపు అవకాశం ఇస్తానని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చెప్పడంతో ఇరు పక్షాలు శాంతించాయి.