సొంత వ్యవసాయ క్షేత్రంలో వైయస్ వాకింగ్
కడప: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో తిరిగారు. రాజశేఖర్ రెడ్డి ఇలుపలపాడులోని తన వ్యవసాయ క్షేత్రంలో నాలుగు కిలోమీటర్లు వాకింగ్ చేశారు. పశువుల పాకలో ఆవుల మధ్య ఆయన ఐదు నిమిషాల పాటు గడిపారు. గోబర్ గ్యాస్ తయారీ తీరును అడిగి తెలుసుకున్నారు. టేకు చెట్లను పరిశీలించారు. ఈ సమయంలో ఆయనతో పాటు కూతరు షర్మిల కూడా ఉన్నారు.
అనంతరం ఆయన మైలవరంలో పర్యటించారు. మైలవరంలో రాజశేఖర్ రెడ్డి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. బాలికల వసతిగృహానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. మైలవరం కాలువ ఆధునీకరణ పనులకు, జూనియర్ కాలేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి వుంటే 20 యేళ్లయినా తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తయి ఉండేది కాదని, తాము రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సోమవారంనాటి నుంచి తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు.